కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్ అర్బన్: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్గా నగరంలోని కట్టరాంపూర్కు చెందిన ఆకుల నర్సయ్య నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. చైర్మన్గా ఆకుల నర్సయ్య, వైస్చైర్మన్ గా సుదగోని లక్ష్మీనారాయణగౌడ్, సభ్యులుగా పంజాల శ్రీనివాస్గౌడ్, బోనాల శ్రీనివాస్, ఖాజా, రుద్ర రాము, మీసాల శంకర్, తపట్ల రాజు, జగ్గని కనకయ్య, రావనవేని సంపత్, కే శవేని భూమయ్య, మాలోతు మాలతి, శివనాథుని వెంకటేశ్వర్లు, పల్ల శివకుమార్లను నియమించారు. వీరితో పాటు కరీంనగర్ సింగిల్విండో చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ శాఖ ఏడీ, నగరపాలకసంస్థ మేయర్ సభ్యులుగా ఉంటారు.
పంతం నెగ్గించుకున్న ‘వెలిచాల’
ఏఎంసీ చైర్మన్గా ఆకుల నర్సయ్య నియామకంతో కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు తన పంతం నెగ్గించుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన అనంతరం కరీంనగర్లో పట్టుపెంచుకోవడానికి వెలిచాల తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఏఎంసీ చైర్మన్గా తన మద్దతుదారుడు ఆకుల నర్సయ్య పేరును అధిష్టానానికి ప్రతిపాదించారు. ఇదే సమయంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన సుదగోని లక్ష్మీనారాయణగౌడ్ పేరును రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తుమల్లేశం సూచించారు. దీంతో ఇందులో ఎవరిది పైచేయి అవుతుందో అనే ఉత్కంఠ కొంతకాలంగా కాంగ్రెస్ వర్గీయుల్లో నెలకొంది. చివరకు ఏఎంసీ చైర్మన్గా ఆకుల నర్సయ్యను నియమించడంతో వెలిచాల రాజేందర్రావు తనపంతం నెగ్గించు కొన్నట్లయింది. కాగా.. చైర్మన్గా నియమితులైన నర్సయ్యను నగరంలోని ఆయన కార్యాలయంలో రాజేందర్రావు సన్మానించారు.


