న్యూస్రీల్
వసతులు భేష్
నైపుణ్యాలు మెరుగు
పూర్వ వైభవం దిశగా ప్రభుత్వ పాఠశాలలు
విద్యాశాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
వసతుల కల్పనకు పెద్దపీట, నాణ్యమైన బోధన
ఐదేళ్లుగా ‘పది’ ఫలితాలు ౖపైపెకి
ఆదరిస్తే పేద విద్యార్థులకు ఎంతో మేలు
కొన్నేళ్లుగా నిర్లక్ష్యపు శిథిలాల కింద చిక్కుకున్న జిల్లాలోని ప్రభుత్వ బడులు ప్రస్తుతం పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పొచ్చు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు విద్యాశాఖపై ప్రత్యేక దృష్టిసారించడమే కాకుండా అత్యధిక నిధులు కేటాయిస్తుండడంతో సర్కార్ బడి గాడిలో పడింది. నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా నిధులు కేటాయిస్తుండడంతో విద్యాశాఖ తీరులో గణనీయమైన మార్పు జరుగుతుంది. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ఉచిత సదుపాయాలు, బోధనలో మార్పులకు చిహ్నంగా నిలుస్తున్న డిజిటల్ తరగతులు, క్రీడలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలన్న దృక్పథంలోకి ప్రభుత్వ పాఠశాలలు వచ్చాయి.
–కరీంనగర్టౌన్...●
తల్లిదండ్రుల్లో కొన్నేళ్లుగా వస్తున్న మార్పులకు అనుగుణంగా జిల్లాలోని ప్రభుత్వ బడులు కూడా ఇంగ్లిష్ మీడియంలో తరగతులు నిర్వహిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాట కార్యక్రమం ప్రయోజనంగా నిలిచినట్లు జిల్లా విద్యాశాఖ గణంకాలు చెబుతున్నాయి.
సన్నబియ్యంతోమధ్యాహ్న భోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థుల ఆకలి తీర్చేందుకు బడుల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పౌష్టికాహారంగా వారానికి మూడు కోడిగుడ్లు అందించడం, కూరల్లో గతేడాది నుంచి నాణ్యత మెరుగుపడింది.
ఉచిత పుస్తకాలు, దుస్తులు
ప్రభుత్వ బడిలో చదివే అన్ని తరగతుల విద్యార్థులకు విద్యాశాఖ ఉచితంగా పుస్తకాలు అందజేస్తుంది. విద్యార్థులకు ఏటా రెండు జతల దుస్తులు, దూర ప్రాంతం నుంచి వచ్చేవారికి రవాణా భత్యం కూడా అందజేస్తుంది.
ఉపాధ్యాయుల కృషి మార్గదర్శకం
విద్యార్థుల ప్రవేశాల కోసం పలు ప్రభుత్వ స్కూళ్ల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అంకితభావాన్ని ప్రదర్శిస్తూ వినూత్న తరహాలో చేపడుతున్న చర్యలు మిగతా ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. దీంతో ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు విద్యను అందించి మెరుగైన ఫలితాలు సాధిస్తూనే పేద, మధ్య తరగతి కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నాయి.
జిల్లాలోని సర్కార్ బడుల్లో విద్యార్థులు ఇబ్బంది పడకుండా పాలకులు, అధికారులు పలు రకాల వసతులను గతానికి భిన్నంగా కల్పిస్తున్నారు. తరగతి గదిలో రోజంతా కూర్చున్న విద్యార్థులు ఇక్కట్లు పడకుండా ప్రైవేటును పోలిన రీతిలో డ్యూయల్ డెస్క్లను జిల్లాలోని అన్ని స్కూళ్లకు విద్యాశాఖ సరఫరా చేసింది. తాగునీటి వసతి, ఆటలాడే విశాలమైన క్రీడా మైదానాలు తదితర వసుతులు కల్పిస్తున్నారు. కాగా, వసతులు, పాఠశాల నిర్వహణ, గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్, ఆటల పరికరాల కోసం ప్రభుత్వం ఏటా నిధులు మంజూరు చేస్తుండగా వాటి వినియోగంపై నిర్లిప్తత లేకుండా పోతుంది.
ప్రభుత్వ బడుల్లో గతంతో పోలిస్తే బోధనలో విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయి. ఐదేళ్లుగా జిల్లాలోని విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రైవేట్కు దీటుగా సాధిస్తున్న ఫలితాలను నిదర్శనంగా తీసుకోవచ్చు. వివిధ పాఠ్యాంశాల్లో మంచి అవగాహన కలిగి బోధన నైపుణ్యాల్లో నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారు. చదువులో వెనుకబడిన పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిని చదువులో ముందుకు నడిపిస్తున్నారు.


