కరీంనగర్స్పోర్ట్స్: దేశ భవిష్యత్, అభివృద్ధి ప్రణాళికలను నిర్ణయించేందుకు జనాభా లెక్కింపు అత్యంత కీలకమైన ప్రక్రియ అని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం బల్దియా నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు జరిగిన 2కే రన్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. 2011లో జనాభా గణన జరిగిందని, అప్పటి నుంచి దేశంలో అనేక మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. ప్రతీ పౌరుడు తమ వివరాలను నమోదు చేయించుకోవడం ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వం అందుబాటులో ఉంచిన స్వీయ గణన ద్వారా ప్రజలు తమ వివరాలు సొంతంగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈనెల 11 నుంచి జనాభా లెక్కింపు ప్రారంభమవుతుందని, ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు ఇళ్లకు వచ్చి జనాభా లెక్కల వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. ప్రజలు కచ్చితమైన వివరాలు అందించి సహకరించాలని కోరారు. సుడా చైర్మన్ నరేందర్రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల అమలుకు జనాభా లెక్కింపు చాలా ప్రధానమైందని తెలిపారు. ఆర్డీవో మహేశ్వర్రావు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.


