విద్యానగర్(కరీంనగర్): కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు జరిగే సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లుతోపాటు ప్రయాణికులకనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగడిమర్రి సోలమన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరంలో కరీంనగర్ జోన్ పరిధిలోని రీజనల్ మేనేజర్లు, డిప్యూటీ రీజనల్ మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని రీజియన్ల పనితీరుపై చర్చించారు. అన్ని బస్ స్టేషన్లలో చల్లని తాగునీటి వసతి కల్పించి తగినన్ని బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి.రాజు, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం రీజనల్ మేనేజర్లు ఎస్.భవానీప్రసాద్, డి.విజయభాను, టి.జ్యోత్న్స, ఎ.సరిరాం, డిప్యూటీ మేనేజర్లు ఎస్.భూపతిరెడ్డి, పి.మల్లేశం, ఎస్.మధుసూదన్, భానుకిరణ్, డి.శ్రీహర్ష, ఎస్.రామయ్య, పి.మల్లయ్య, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్యదర్శి కె.యుగంధర్ పాల్గొన్నారు.


