తంగళ్లపల్లి(సిరిసిల్ల): మలిసంధ్యలో కంటికి రెప్పలా కాపాడాల్సిన వారు కరువైనా, విధి వంచించినా మేమున్నామంటూ ముందుకొచ్చారు గడ్డం తిరుమల శ్రీనివాస్. వేములవాడ రాజన్న సన్నిధిలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఇద్దరు వృద్ధులకు తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్లోని ‘అమ్మా అనాథ వద్ధాశ్రమం’లో ఆశ్రయం కల్పించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన పదిరే రేణుక, నర్సంపేట ప్రాంతానికి చెందిన భూమేళ్ల సమ్మక్క కొద్దిరోజులుగా వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. వీరికి రక్త సంబంధీకులు ఎవరూ లేక నిస్సహాయ స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు.
పోలీసుల సహకారంతో ఆశ్రమానికి..
వీరి దీన స్థితిని గమనించిన పలువురు సామాజిక కార్యకర్తలు అమ్మా అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకులు గడ్డం తిరుమల శ్రీనివాస్కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన శ్రీనివాస్ సంబంధిత పోలీస్స్టేషన్ ఎస్సైని సంప్రదించి వారి అనుమతితో ఇద్దరు వృద్ధులను ఆశ్రమానికి చేర్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదరణ కోల్పోయిన వృద్ధులకు సేవ చేయడమే తమ ఆశ్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
మానవత్వం చాటుకున్న తిరుమల శ్రీనివాస్


