● వేసవిలో తాగునీటి ఎద్దడి తీర్చాలి ● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కందులు అమ్ముకుని రైతులు మద్దతు ధర పొందాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలన్నారు. అంతకు ముందు క్యాంపు కార్యాలయంలో 60మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందించారు. మండల పరిషత్లో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల వారిగా మంజూరైన ఉపాధి హామీ సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, జీపీ భవనాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. రుక్మాపూర్లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రదీప్, సాయికిరణ్ కుటుంబాలను పరామర్శించి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఏఎంసీ చైర్మన్ కొత్తూరి మహేశ్, వైస్ చైర్మన్ మునిగాల రాజేందర్, మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరిత, వైస్ చైర్ పర్సన్ పెరుమాండ్ల మానస, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ సీఈవో కళ్లెం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
అమరుల ఆశయాలు కొనసాగించాలి
కరీంనగర్టౌన్: పేద ప్రజల కోసం తమ ప్రాణాలు అర్పించి, నిజాం నవాబు రజాకార్లపై రణభేరి మోగించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్ రావు అని సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం అనభేరి ప్రభాకర్రావు 78వ వర్ధంతి సందర్భంగా నగరంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం వద్ద ఆయన విగ్రహానికి సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్తో కలిసి నివాళి అర్పించారు. పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, గూడెం లక్ష్మి, టేకుమల్ల సమ్మయ్య, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, న్యాలపట్ల రాజు, ఉమ్మెంతల రవీందర్రెడ్డి, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పరిశీలన
ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నామని, ఆలయానికి రంగులు వేస్తున్నట్లు వెల్లడించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీన ఏకాంతసేవతో ముగుస్తాయని తెలిపారు. ఇన్చార్జి ఈవో సుధాకర్, ధర్మకర్తలు పరమేశ్, కిరణ్, రాంరెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.


