నగర సుందరీకరణకు ప్రాధాన్యం
కరీంనగర్ కార్పొరేషన్: నగర సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ఆదేశించారు. సోమవారం పెండింగ్ పనులపై సుడా వైస్చైర్మన్, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్తో కలిసి ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెండర్ పూర్తయిన, పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. నగరంతో పాటు పరిసర గ్రామాల ప్రధాన రహదారులు, జంక్షన్లు, డివైడర్ల సుందరీకరణకు ప్రాధాన్యమివ్వాలన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన వర్టికల్ గార్డెన్లు,జంక్షన్ల సుందరీకరణ, పార్కుల పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ఐడీఎస్ఎంటీలో మిగిలిన పనులు వారం రోజులలో పూర్తి చేయాలని, ఫుడ్కోర్టు పనుల శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్టీఆర్ కూడలితో పాటు నూతన జంక్షన్ల సుందరీకరణకు రూపకల్పన చేయాలని సూచించారు. రాజీవ్ చౌక్, యూనివర్సిటీ ఎదుట జ్యోతిబాపూలే జంక్షన్ పనులు వెంటనే పూర్తిచేసి, ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ శివానంద్, డీఈలు రాజేంద్రప్రసాద్, వెంకటేశ్వర్లు, ఏఈలు పి.సతీశ్, టి.సతీశ్ పాల్గొన్నారు.
వేసవిలో విద్యుత్ ఇబ్బంది లేకుండా చర్యలు
కొత్తపల్లి(కరీంనగర్): వేసవిలో పెరుగుతున్న డి మాండ్కు అనుగుణంగా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టినట్లు టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఇన్చార్జి ఎస్ఈ వడ్లకొండ గంగాధర్ తెలిపారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ డిమాండ్ గత ఏడాది మార్చి నెలలో 5,816 మెగావాట్లు ఉండగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 నాటికి 5,904 మెగావాట్లకు చేరిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రాంతాల్లో లోడ్ పెరుగుదల అంచనాల మేరకు ఓవర్లోడ్ అవుతున్న 141 పంపిణీ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచినట్లు తెలిపారు. అదనంగా 116 కొత్త పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట్ల 9 సంఖ్య పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. 4 కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు, అవసరమైన ప్రాంతాల్లో 32 కొత్త బ్రేకర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా నాణ్యత మెరుగుపరిచేందుకు 29 సంఖ్య 33/11 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
1 నుంచి సంసద్ ఖేల్ మహోత్సవ్
కరీంనగర్: సంసద్ ఖేల్ మహోత్సవ్ పేరిట మార్చి 1 నుంచి 7వరకు క్రీడా పోటీలు జరుగుతాయని, ప్రధానంగా పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్చి ఒకటి నుంచి 3 వరకు, గెలుపొందిన జట్లకు 5,6,7 తేదీల్లో కరీంనగర్లో పోటీలు కొనసాగుతాయని బీజే పీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలి పారు. సోమవారం కరీంనగర్ పార్లమెంట్ కా ర్యాలయంలో సంసద్ ఖేల్ మహోత్సవ్ నిర్వహణ ఏర్పాట్ల కోసం బీజేపీ ముఖ్య నేతలు, ఇన్చార్జిలతో సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని స్పోర్ట్స్ పవర్ హౌస్ గా మార్చాలని విజన్ పెట్టుకున్నారని, ఆ దిశలోనే ప్రతి ఏటా ఖేల్ మహోత్సవ పేరిట క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు ఈనెల 25 నుంచి 27వరకు అసెంబ్లీవారీగా తమపేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇనుకొండ నాగేశ్వర్రెడ్డి, మాడ వెంకటరెడ్డి, బోయినపల్లి ప్రవీణ్ రావు, గుర్రాల వెంకటరెడ్డి పాల్గొన్నారు.
నగర సుందరీకరణకు ప్రాధాన్యం
నగర సుందరీకరణకు ప్రాధాన్యం


