ఆరోగ్య సంరక్షకుల రక్షణే లక్ష్యం
కరీంనగర్: హెపటైటిస్–బీ వంటి అంటువ్యాధుల నుంచి ఆరోగ్య సంరక్షకులను రక్షించడం, ముందస్తు జాగ్రత్త చర్యలతో వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసమే అడల్ట్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. కరీంనగర్లోని మోతాజుఖానా ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఆరోగ్య సంరక్షకుల కోసం అడల్ట్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ ఆరోగ్య సేవలందించే సిబ్బంది నిరంతరం రోగులతో సంబంధం కలిగి ఉండడం వల్ల వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే ఈ టీకా వారికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టీకా కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాజిదా, జిల్లా ఉప వైద్యాధికారి రాజగోపాల్రావు, పీవో డీటీటీ ఉమాశ్రీ, పీవో ఎంహెచ్ఎన్ సన జవేరియా, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఇమ్రాన్ పాల్గొన్నారు.


