పదిలంగా చదివేద్దాం!
● సమీపిస్తున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ● ఒత్తిడి లేకుండా రాయాలంటున్న నిపుణులు
సప్తగిరికాలనీ(కరీంనగర్): పదోతరగతి పరీక్షలు ప్రతీ విద్యార్థి జీవితంలో ఎంతో కీలకం. ఈ దశలో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాస్తేనే అత్యుత్తమ మార్కులు సాధించొచ్చు. మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అంటే ఇంకా 3 వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రతీ విద్యార్థి ప్రతీ రోజును సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదివితేనే ఎక్కువ మార్కులు పొందొచ్చు. ఈ సందర్భంగా నిపుణుల సలహాలు, సూచనలతో సాక్షి ప్రత్యేక కథనం.
● విద్యార్థులు 5 సామర్థ్యాల మీద ప్రతిస్పందన, స్వీయ రచన, సృజనాత్మకత, పదజాలం, వ్యాకరణంపై పట్టు సాధించాలి.
● ప్రతీ పాఠంలోని చుక్క పెట్టిన పద్యాలు బాగా జ్ఞాపకం చేయాలి. పద్యం ప్రతిపదార్థం, పద్య పూరణలపై బాగా దృష్టి పెట్టాలి. పద్య పూరణ చేసేటప్పుడు ప్రాస అక్షరం ఆధారంగా పద్యాన్ని పూరించడం అభ్యాసం చేయాలి.
● స్వీయ రచన ప్రశ్నల్లో ఆలోచించేలా అవగాహనతో రాసేలా ప్రశ్నలుంటాయి కాబట్టి.. స్వీయ రచన ప్రశ్నలను అర్థం చేసుకోవాలి. ఇందుకుగాను పాఠ్యాంశాల సారాంశాన్ని బాగా చదవాలి.
● పాఠంలో ఉన్న కవి, రచయిత పరిచయాలను క్షుణ్ణంగా చదవాలి. వీటి నుంచి మూడు మార్కుల ప్రశ్న తప్పకుండా వస్తుంది.
● సృజనాత్మకతకు సంబంధించి వివిధ ప్రక్రియలపై పట్టు సాధించాలి. ముఖ్యంగా లేఖ, వ్యాసం, లేఖ, సంభాషణ, కరపత్రం, ఆహ్వాన పత్రిక, వచన కవిత, ఆత్మకథ ఇంటర్వ్యూ ప్రశ్నలు తదితర అంశాలపై బాగా దృష్టి పెట్టాలి.
● పదజాలానికి సంబంధించి పాఠ్య పుస్తకం వెనక ఉన్న పదనిఘంటువు పట్టికను క్షుణ్ణంగా చదవాలి. వ్యాకరణాంశాలకు సంబంధించి ప్రతీ పాఠం వెనకున్న అభ్యాసాలను సాధన చేయాలి.
● వ్యాకరణాంశాల్లో ముఖ్యంగా త్రిక, రుగాగమ, సవర్ణదీర్ఘ, గుణ, వృద్ధి, యణాదేశ సంధులపై అకార, ఇకార, ఉకార, సంఘాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సమాసాల్లో ద్వంద్వ, ద్విగు, బహువ్రీహి, తత్పురుష సమాసాలపై శ్రద్ధ పెట్టాలి. ప్రత్యక్ష, పరోక్ష, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలపై దృష్టి పెట్టాలి.
– గాజుల రవీందర్, రిసోర్స్పర్సన్,
జీహెచ్ఎస్, సప్తగిరికాలనీ, కరీంనగర్
పదిలంగా చదివేద్దాం!


