
చిక్కుతున్నా ఆగని ‘చేతివాటం’
లంచం తీసుకోవడం ఓ జబ్బు
సిరిసిల్ల: అధికార యంత్రాంగంలో అవినీతి ఆగడం లేదు. సామాన్యులను లంచాల కోసం వేధిస్తున్నారు. వేధిస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతున్నా కక్కుర్తి చర్యలు ఆగడం లేదు. లంచావతారులు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ కాసులకు చేయిచాస్తూ కటకటాల పాలవుతున్నారు.
భూమి కొలిచేందుకు ముందే లంచం
● సిరిసిల్ల శివారులో మూడెకరాల భూమి కొలిచేందుకు రూ.30వేల లంచం డిమాండ్ చేసిన వేణుగోపాల్ రూ.10 వేలు ముందుగా ఇస్తేనే సర్వేకు వెళ్లారు. సర్వే పంచనామా నివేదిక కోసం మరో రూ.20 వేలు డిమాండ్ చేసి సహాయకుడితో సహా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
● మే 31న సిరిసిల్ల శివారు చంద్రంపేటలో సర్వేయర్ మల్లోజీ నాగరాజు వెంకటాపూర్కు చెందిన మల్లేశం ఆరుగుంటల భూమిని సర్వే చేసేందుకు ముందే రూ.22వేల లంచం తీసుకున్నారు. సర్వే పంచనామా కాపీ కోసం మళ్లీ డబ్బు డిమాండ్ చేసి రూ.15వేలు తీసుకుంటూ దొరికాడు.
● గతంలో వీర్నపల్లి మండలం అడవి పదిరకు చెందిన భూక్యా సరిత టిప్పర్ కోసం దరఖాస్తు చేసింది. ప్రభుత్వం ద్వారా సబ్సిడీ వస్తుందనే ఆశతో జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా హైదరాబాద్లోని పరిశ్రమలశాఖ కమిషనర్ ఆఫీస్కు దరఖాస్తు పంపాలని సరిత కోరింది. ఇందుకు జిల్లా పరిశ్రమల శాఖ జీఎం ఉపేందర్రావు రూ.30వేలు లంచంగా అడిగాడు. రూ.17వేలు ఓసారి అందించగా, మరోసారి రూ.13వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
● జిల్లా పరిశ్రమల శాఖలో అవినీతి జరుగుతుందని ముస్తాబాద్ మండలం తుర్కపల్లెకు చెందిన చింతకింది సుధీర్ గతంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. టీ–ఫ్రైడ్లో సబ్సిడీ ట్రాక్టర్ కోసం దరఖాస్తు చేయగా, ఆన్లైన్ చేసేందుకు పరిశ్రమలశాఖ ఆఫీస్లో రూ.2,500 కృష్ణ, కిశోర్ అనే అధికారులు అడిగారని సుధీర్ ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఫిర్యాదులున్నా పరిశ్రమల శాఖ ఆఫీస్పై నియంత్రణ లేక పోవడంతో ఏకంగా ఆ శాఖ జిల్లా అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు.
● సిరిసిల్ల భూసర్వే అధికారి ఇల్లంతకుంటలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వేములవాడ పంచాయత్రాజ్ డీఈఈ మహేందర్ తడగొండకు చెందిన కట్ట లచ్చయ్య వద్ద రూ.60వేలు తీసుకుంటూ.. సిరిసిల్ల జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాస్రావు, రేంజ్ అధికారి అనిత.. ఫారెస్టు సెక్షన్ అధికారి శ్రీనివాస్ వద్ద రూ.4లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
● వేములవాడ తహసీల్దార్ ఆఫీస్లో సర్వేయర్గా పనిచేస్తున్న సత్యనారాయణ నాలా మార్పిడి కోసం బాలరాజు వద్ద రూ.20వేలు లంచం తీసుకుంటూ దొరికాడు.
● వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ధి సంస్థ(వీటీడీఏ) ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీవో) లక్ష్మణ్గౌడ్, అతడి కొడుకు రోహిత్ లేఅవుట్ అనుమతి కోసం రియల్టర్ల వద్ద రూ.6.50లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కారు.
కాసులకు కక్కుర్తి.. పెచ్చుమీరిన అవినీతి
తాజాగా సిరిసిల్లలో ఏసీబీకి పట్టుబడిన సర్వేయర్
లంచం తీసుకోవడం అనేది క్రిప్టోమేనియా వ్యాధి. లంచం తీసుకోవడం ఎంత తప్పో.. ఇవ్వడం కూడా తప్పే. అన్నీ సమగ్రంగా ఉండేలా దరఖాస్తు చేయాలి. అయినా అధికారులు డబ్బులు అడిగితే ఏసీబీ టోల్ ప్రీ నంబరు 1064కు ఫిర్యాదు చేయాలి. నేరుగా మాకు వస్తుంది. ఫిర్యాదుదారు వివరాలను గోప్యంగా ఉంచి అవినీతి పరులను పట్టుకుంటాం. అవినీతిని నిరోధించడంలో పౌర సమాజం సహకరించాలి.
– పి.విజయ్కుమార్, ఏసీబీ డీఎస్పీ, కరీంనగర్

చిక్కుతున్నా ఆగని ‘చేతివాటం’