కలిసే ‘పోయిన’ మామాఅల్లుళ్లు | - | Sakshi
Sakshi News home page

కలిసే ‘పోయిన’ మామాఅల్లుళ్లు

Oct 1 2025 1:57 PM | Updated on Oct 1 2025 1:57 PM

కలిసే

కలిసే ‘పోయిన’ మామాఅల్లుళ్లు

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): చిన్నప్పట్నుంచి కలిసే ఉన్నారు.. పెరిగి పెద్దయ్యాక కూడా ఒకరిని విడిచి మరొకరుఉండేవారు కాదు.. మరణంలోనూ కలిసే పోయారు.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ పట్టణంలోని కాల్వశ్రీరాంపూర్‌ రోడ్డులో మంగళవారం వేకువజామున రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో మామ ముత్యం రాకేశ్‌(31), ఆయన సొంత అక్కకొడుకు పూదరి రోహిత్‌ ఉరఫ్‌ అభి(21) దుర్మరణం చెందారు. బతుకమ్మ, దసరా పండుగల పూట జరిగిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కుటుంసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..

సుల్తానాబాద్‌లోని గౌడవీధికి చెందిన ముత్యం రాజేశ్వరి–శంకరయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్నకొడుకు రాకేశ్‌ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన సెక్యూరిటీగా పని చేస్తున్నాడు. ఇదేపట్టణంలోని సుభాష్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాజేశ్‌ పెద్దఅక్క పూదరి స్వప్న–రమేశ్‌ దంపతుల చిన్న కొడుకు పూదరి రోహిత్‌ వయసు దాదాపు సమానంగా ఉంటుంది. దీంతో వారు చిన్నప్పట్నుంచి కలిసే ఉంటున్నారు. ఏ పని అయినా కలిసే చేస్తున్నారు. ఎక్కడికై నా కలిసే వెళ్తున్నారు. సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని సుగ్లాంపల్లికి చెందిన పాపని ఆదర్శ్‌ వీరి స్నేహితుడు. సమీపంలోని సుద్దాల గ్రామానికి చెందిన మరో స్నేహితుడి వద్దకు వెళ్లిన ఆదర్శ్‌కు కడుపునొప్పి వచ్చింది. ఈ విషయాన్ని రాకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సోమవారం రాత్రి రాకేశ్‌, రోహిత్‌ కలిసి ద్విచక్ర వాహనంపై సుద్దాలకు వెళ్లారు. అక్కడ ఆదర్శ్‌ను వాహనంపై ఎక్కించుకున్నారు. రోహిత్‌ నడుపుతుండగా ఆదర్శ్‌ మధ్యలో, రాకేశ్‌ వెనకాల కూర్చుని సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి బయలుదేరారు. ఇదేసమయంలో సుల్తానాబాద్‌ మండలం అల్లీపూర్‌ గ్రామానికి చెందిన గసిగంటి రఘు సుల్తానాబాద్‌ నుంచి అల్లీపూర్‌ గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. సుద్దాల శివారులోని ఇటుక బట్టి వద్దగల కాల్వశ్రీరాంపూర్‌ రోడ్డులో రెండు ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ఢీకొన్నాయి. దీంతో నలుగురికి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం రాకేశ్‌, రోహిత్‌ను కరీంనగర్‌కు తరలిస్తుండగా ఇద్దరూ మార్గమధ్యంలోనే మృతి చెందారు. బతుకమ్మ, దసరా పండుగల పూట మామఅల్లుళ్లు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆదర్శ్‌, రఘు తీవ్రగాయాలతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాకేశ్‌ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. సంఘటన స్థలాన్ని సీఐ సుబ్బారెడ్డి పరిశీలించారు. మృతుల కుటుంబసభ్యులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌ మంగళవారం పరామర్శించారు.

శ్రద్ధాంజలి ఘటించిన వైద్యులు

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): కాగా, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రాకేశ్‌ మృతదేహంపై డీడీవో డాక్టర్‌ రమాదేవి, డాక్టర్లు మహేందర్‌, సతీశ్‌, పర్హత్‌, విశాల్‌, అనితరెడ్డి, హెడ్‌సిస్టర్‌ రాణి, సిబ్బంది పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. రాకేశ్‌, రోహిత మృతి సమాచారం అందుకున్న బంధువులు, స్థానికులు వివిధ పార్టీల నేతలు స్థానిక ఆస్పత్రికి భారీగా తరలివచ్చారు. బంధువుల రోదనలతో ఆస్పత్రి ఆవరణ దద్దరిల్లింది.

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరి దుర్మరణం

మరో ఇద్దరికి తీవ్రగాయాలు

పండుగపూట విషాదం

కలిసే ‘పోయిన’ మామాఅల్లుళ్లు 1
1/3

కలిసే ‘పోయిన’ మామాఅల్లుళ్లు

కలిసే ‘పోయిన’ మామాఅల్లుళ్లు 2
2/3

కలిసే ‘పోయిన’ మామాఅల్లుళ్లు

కలిసే ‘పోయిన’ మామాఅల్లుళ్లు 3
3/3

కలిసే ‘పోయిన’ మామాఅల్లుళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement