
వ్యవసాయ పండుగ
● హలాలు పట్టి.. పొలాలు దున్ని ● సాగుకు సిద్ధమైన అన్నదాతలు రేపు ఏరువాక పున్నమి
విద్యానగర్(కరీంనగర్):
తొలకరి పిలుపు.. రైతన్న మోము చిగురు.. పిల్ల కాలువల గెంతులాట.. పుడమి తల్లి పులకరింతకు సాక్ష్యమే ఏరువాక పౌర్ణమి. ఆధునికత ఎంత ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. రుతుపవనాల ఆగమనంతో పౌర్ణమి నాటికి తొలకరి పడి భూమి మెత్తబడుతుంది. దుక్కి దున్నడం, వ్యవసాయ పనులను ప్రారంభించడం ఏరువాకతోనే మొదలౌతుంది. ఈనెల 11న ఏరువాక పౌర్ణమి సందర్భంగా స్పెషల్ స్టోరీ.
దేశమంతటా..
ఏరువాకను జ్యోతిష్య శాస్త్రవేత్తలు కష్యారంభం, సస్యారంభం అని వ్యవహరిస్తారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. జేష్ట మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం దేశమంతా ఒకేలా ఉంటుంది. దేశంలో దాదాపు 80 శాతం వర్షపాతం నైరుతి వల్లే కలుగుతుంది. పాడి పంటలు, పొలం పనులకు ఆటంకాలు ఎదురవ్వొద్దని ఏరువాకను మహా యజ్ఞంలా పరిగణించి ఆచరిస్తారు. నాగేటి సాల్లల్లో సీత దొరికింది కాబట్టి సీతా యజ్ఞంగానూ భావిస్తారు. మరో విశేషం ఏమిటంటే.. ఈరోజే ఒడిశాలోని పూరీ జగన్నాథునికి స్నానోత్సవం నిర్వహిస్తారు.
రైతుకు అండగా ప్రభుత్వాలు
రైతులకు అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలుస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. భూరికార్డుల ప్రక్షాళనతో రైతు పట్టాలన్నింటికి పక్కాగా లెక్క తేల్చి కొత్త పాసు పుస్తకాలతో రైతును రాజును చేశారు. వ్యవసాయం కోసం బ్యాంకు రుణాలు పొంది వాటిని తీర్చలేక రుణగ్రస్తులైనవారిని రుణ విముక్తులను చేయడానికి విడతలవారీగా రుణమాఫీ చేస్తున్నారు. పంట బీమా సౌకర్యం కల్పించారు. రైతుబంధు పథకాన్ని అమలు చేస్తూ నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు. రైతు బీమా పథకం ద్వారా 18 నుంచి 59 ఏళ్ల లోపు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి తక్షణం రూ.5లక్షలు పరిహారంగా అందిస్తున్నారు. ప్రతీ గ్రామీణ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 సంచార పశు వైద్యశాలలను నిర్వహిస్తున్నారు. 24 గంటల కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాలను అందిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి బాసటగా నిలుస్తోంది.
దుక్కి దున్నుతున్న రైతన్న
అతి ప్రాచీనం..
ఏరువాక పండుగ అతి ప్రాచీనమైనది. శ్రీకష్ణ దేవరాయలు ఈరోజున రైతుల కృషిని అభినందించి తగిన రీతిలో వారిని ప్రోత్సహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శుద్దోదన రాజు కపిలవస్తులో లాంఛనంగా ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని రైతులకు అందించినట్లు కథలున్నాయి. ఏరువాకతో వ్యవసాయానికి సిద్ధమయ్యే రైతులకు ధాన్యపు సిరులు కురవాలని ఆశిద్దాం.
ఏరువాక అంటే..
అన్నదాతలు వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ప్రతి ఏటా జ్యేష్ట శుద్ధ పూర్ణిమ నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఏరు అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం కావడమని అర్థం. పండుగ రోజు రైతులు కాడెద్దులను కడిగి కొమ్ములకు రంగులు వేసి గజ్జెలు, గంటలతో అలంకరిస్తారు. ఎడ్లకు కట్టే కాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు. భూమిని దుక్కి దున్నడం ప్రారంభిస్తారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య వ్యవసాయ పనులు మొదలుపెడతారు.
నాణ్యమైన విత్తనాలు అందజేయాలి
ప్రభుత్వం నేరుగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలి. నాణ్యత లేని విత్తనాలతో పంట నష్టమే కాకుండా కాలం కూడా నష్టపోతాం. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని రైతులకు నేరుగా విత్తనాలు అందించాలి. ప్రతీ గ్రామంలో శాశ్వతంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ధాన్యం ఆరపోసేందుకు, నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. అప్పుడే రైతు పంట నష్టపోకుండా ఉంటాడు.
– రవీందర్రెడ్డి, ఆర్గానిక్ పద్ధతిలో సేద్యం చేస్తున్న వ్యవసాయదారుడు, కరీంనగర్
దిగుబడి పెరిగితేనే లాభం
గతంలో కంటే రాష్ట్రం వచ్చిన తరువాత రైతు కష్టాలు కొద్దికొద్దిగా తీరుతున్నాయి. పంట పెట్టుబడి ఇవ్వడం, ప్రభుత్వమే ధాన్యం కొనడం, రైతు, పంట బీమా అమలు చేయడంతో రైతుకు మేలు జరుగుతోంది. వాతావరణం కూడా అనుకూలించి దిగుబడి పెరిగితే వ్యవసాయం లాభాసాటిగానే ఉంటుంది.
– బొప్పు శ్రీహరి, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, మానకొండూర్

వ్యవసాయ పండుగ

వ్యవసాయ పండుగ