
మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయండి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ భవనాల నిర్మాణం, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో సమీక్షించారు. వివిధ కార్యక్రమాలు, పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ, టాయిలెట్లు, కిచెన్ షెడ్, వివిధ ప్రభుత్వ భవనాల మరమ్మతు, కొత్త భవనాల నిర్మాణాలకు పనులు మంజూరు చేశామని తెలిపారు. సదరు పనులకు సంబంధించిన గ్రౌండింగ్ 100 శాతం పూర్తి చేయాలన్నారు. ఏఈలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఇదివరకే మొదలైన పనులను వేగవంతం చేసి రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇంకా అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాల్లోకి తరలించాలన్నారు. అక్కడ అవసరమైన మరమ్మతు చేయిస్తామని, టాయిలెట్లు నిర్మిస్తామని, నీటి వసతి కల్పిస్తామని అన్నారు. ఎంపీడీవోలు, సీడీపీవోలు సమన్వయంతో తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పాఠశాలలు ప్రారంభమవుతున్నందున మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. వర్షం కారణంగా నీరు నిలవకుండా చూడాలని, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను తనిఖీ చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, డీఎండబ్ల్యూవో పవన్కుమార్ తదితరులున్నారు.