
నకిలీ కట్టడికి కసరత్తు
● శాంపిళ్ల సేకరణకు ప్రభుత్వం ఆదేశం ● కరీంనగర్ పరీక్ష కేంద్రం యాక్టివ్ అయ్యేనా ● పక్కాగా సాగితేనే ప్రయోజనం
కరీంనగర్ అర్బన్: నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. నాణ్యత లేని విత్తనాలను కొని అన్నదాతలు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల క్రమంలో జిల్లాలోని విత్తన, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నారు. పత్తి, వరి, ఇతర విత్తనాల శాంపిళ్లను సేకరించాలని నిర్ణయించారు. వానాకాలం సీజన్ ముందు నుంచి 2026 ఫిబ్రవరి వరకు అన్ని సీడ్, ఫర్టిలైజర్ దుకాణాల్లో విత్తన నమూనాలు సేకరించాలని సర్కారు నిర్దేశించింది. ఈ క్రమంలో డీఏవో, ఏడీఏ, ఏవో, ఏఈవోలు తమ తమ పరిధిలో తనిఖీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
పక్షం రోజుల్లో ఫలితాలు
గతంలో నకిలీ విత్తనాలు లభించటంతో జిల్లాలోని కొందరు డీలర్లపై కేసులు నమోదు చేశారు. తాజాగా నకిలీ విత్తనాల విక్రయాలపై నిఘా పెంచారు. పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులతో తనిఖీ బృందాలను నియమించారు. పంటల సాగు విస్తీర్ణం పెరగనున్న నేపథ్యంలో విత్తనాల పంపిణీపై దృష్టి సారిస్తున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా సేకరించిన విత్తన నమూనాలను హైదరాబాద్లోని ప్రయోగశాలకు పంపించనున్నారు. 15 రోజుల తర్వాత ల్యాబ్ నుంచి వచ్చిన ఫలితాల ఆధారంగా విత్తనాలు సాగుకు అనుకూలం కాకపోతే సదరు దుకాణాల్లో విక్రయాలను నిలిపేస్తారు. వాటిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు.
శాంపిళ్లు హైదరాబాద్కేనా
ఉమ్మడి రాష్ట్రంలో భూసారం, విత్తన, ఎరువుల పరీక్ష కేంద్రమున్న ప్రాంతాలు 5 మాత్రమే. ఆంద్రప్రదేఽశ్లో తాడెపల్లిగూడెం, అనంతపురం, బాపట్లలో పరీక్ష కేంద్రాలుండగా తెలంగాణలో హైదరాబాద్, వరంగల్లో ఉన్నాయి. ఏటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో విత్తన, ఎరువుల నమూనాలు సేకరించడం వాటిని పరీక్షల నిమిత్తం వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో వరి, పత్తి, మొక్కజొన్న, కంది సాగు ఎక్కువగా ఉండటంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకేంద్రంగా కొత్తపల్లి సీడ్ఫాంలో విత్తన, ఎరువుల పరీక్ష కేంద్రాన్ని నిర్మించారు. విత్తన, ఎరువులకు సంబంధించిన నమూనాలను సేకరించేలా ప్రతి ఏటా రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ లక్ష్యాన్ని నిర్దేశిస్తుంటారు. ఆయా కంపనీల పత్తి, మొక్కజొన్న, వరి, కంది, ఇతర విత్తనాలను సేకరించి పరీక్షలకు పంపడం,. ఫలితాల తదుపరి చర్యలు తీసుకోవడం జరిగే ప్రక్రియ. ఈసారి ఖరీఫ్కు గానూ జిల్లాకు 530 ఎరువులు, 120 పత్తి విత్తనాలు, వరి 220, ఇతర విత్తనాలు 111 నమూనాలను సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించింది. గత ఐదేళ్లలో ఎరువులు, విత్తనాల్లో నాణ్యత లేదని 20 వరకు నమూనాల్లో తేలింది. ప్రస్తుతం కోర్టులో కేసులు నడుస్తుండగా నమూనా ఫలితాలు రావడం మాత్రం ఆలస్యమవుతోంది. సేకరించిన విత్తన, ఎరువుల నమూనాలను హైదరాబాద్లోని రాజేంద్రనగర్కు పంపిస్తున్నారు. విత్తన పరీక్షలో రెండు రకాల పరీక్షలు నిర్వహిస్తుంటారు. సర్వీస్ టెస్ట్, ఆక్టివ్ టెస్ట్లు ఉండగా సర్వీస్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. యాక్టివ్ టెస్ట్కు సంబంధించి ప్రతిపాదనల దశలో ఉండగా నామమాత్రంగా మిగిలింది. యాక్టివ్ టెస్ట్ జరిగితేనే శాంపిళ్లను ఇక్కడికిక్కడే ఫలితాలను తేల్చొచ్చు..తక్షణమే చర్యలు చేపట్టొచ్చు.
రైతులు జాగ్రత్తా
లైసెన్స్ దుకాణాల్లోనే విత్తనాలు కొనాలి. విత్తన ప్యాకెట్, బస్తాలపై లాట్ నంబర్, కంపెనీ పేరు, ప్యాకింగ్ తేదీ వంటి వివరాలు ఉన్నాయో లేదా చూసుకోవాలి. విత్తనాల కొనుగోలుకు సంబంధించిన రసీదును భద్రపరచుకోవాలి. అనుమతులు లేకుండా విడిగా విక్రయించే గింజలను కొనొద్దు. దళారుల మాటలు నమ్మొద్దు. విత్తన నాణ్యతపై సందేహాలుంటే వ్యవసాయాధికారులను సంప్రదించాలి. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని గుర్తిస్తే వ్యవసాయాధికారులు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
సీజన్ మొత్తం తనిఖీలు..
వ్యవసాయ సీజన్ జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. విత్తన, ఎరువుల విక్రయ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించేలా వ్యవసాయా దికారులకు ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. క్షేత్రస్థాయిలో ఏఓలు నమూనాలు సేకరించి ఉన్నతాధికారుల ఆదేశాలతో ల్యాబ్కు తరలించనున్నారు. నెలవారీ లక్ష్యాల ప్రకారం నమూనాలు సేకరించటంతో డీలర్లు నకిలీ విత్తనాలను విక్రయించే ఆస్కారం ఉండబోదని అధికారులు చెబుతున్నారు. ఏదైనా దుకాణంపై అనుమానమొచ్చినా, ఫిర్యాదులందినా రెండు, మూడుసార్లు నమూనాలు సేకరిస్తామని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు.