ఎక్కడి సమస్యలు అక్కడే! | - | Sakshi
Sakshi News home page

ఎక్కడి సమస్యలు అక్కడే!

Jun 12 2025 3:41 AM | Updated on Jun 12 2025 3:41 AM

ఎక్కడి సమస్యలు అక్కడే!

ఎక్కడి సమస్యలు అక్కడే!

జిల్లాలో పర్యవేక్షణ అధికారుల కరువు

అక్కడక్కడ వసతుల లేమి

రూ.కోట్లు వెచ్చిస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే

డీఈవో సైతం ఇన్‌చార్జియే

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

కరీంనగర్‌: వేసవి సెలవులు ముగిశాయి.. విద్యార్థులు ఆటపాటలకు టాటా చెప్పి.. బడిబాట పట్టే సమయం రానేవచ్చింది.. ఎప్పటిలాగా ఈ ఏడాది కూడా సర్కారు స్కూళ్లు కొద్దిపాటి సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. పర్యవేక్షణాధికారుల లేమి, అక్కడక్కడ మౌలిక వసతులలేమి, తదితర సమస్యలతో విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. ప్రైవేట్‌ పాఠశాలలు రోజురోజుకు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ ఏడాది కూడా పాత సమస్యలతోనే స్వాగతం పలుకుతున్నాయి.

కరీంనగర్‌ జిల్లాలోని 16 మండలాలకు గాను 16 మండలాలకు ఇన్‌చార్జి ఎంఈవోలే కొనసాగుతున్నారు. జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీరాం మొండయ్య సైతం ఇన్‌చార్జిగానే కొనసాగుతున్నారు. దీంతో పర్యవేక్షణ కొరవడి విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. ఇద్దరు ఉప విద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జీల పాలన సాగుతోంది. దీంతో ప్రాథమిక పాఠశాలల విద్యవ్యవస్థ మెరుగుకై కోట్ల నిధులు వెచ్చిస్తున్న ప్రభుత్వ విద్య పేదల దరి చేరడంలేదు. వీటికి తోడు పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధనేతర సిబ్బంది కొరత, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగిస్తూ చదువులకు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థులకు చదువు అంతంత మాత్రమే అందుతోంది. సర్కారు పాఠశాలల్లో సమస్యల కారణంగా ప్రతీ సంవత్సరం వందలాది మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైౖవేటుకు వెళ్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 651, కేజీబీవీలు 12, ఆదర్శ పాఠశాలలు 11 ఉన్నాయి. వీటితో పాటు ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 1,60,377 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన తీరుపై తల్లిదండ్రులు నమ్మకం కోల్పోయి పిల్లలను ప్రైౖవేట్‌ పాఠశాలల్లో చేర్చడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల సంఖ్యకు మించి పోవడం జరుగుతోంది. ఈ పరిణామం అటు విద్యాశాఖను ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. పరిస్థితి ఇలానే ఉంటే.. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు ఏ మేరకు మిగులుతాయో వేచి చూడాలి.

ఇద్దరు ఉప విద్యాధికారులు ఇన్‌చార్జిలే..

ఉన్నత పాఠశాలలను పర్యవేక్షించే ఉప విద్యాధికారుల పోస్టులు కరీంనగర్‌, హుజూరాబాద్‌తో పాటు జిల్లా పరిషత్‌ డెప్యూటీ ఈవోలంతా ఇన్‌చార్జిలే. సబ్జెక్టు టీచర్ల కొరత అక్కడక్కడ ఉండడంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు విషయ పరిజ్ఞానం దెబ్బతింటోంది.

టాయిలెట్లు.. ప్రహరీ లేవు

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్లో మూత్రశాలలు.. ప్రహరీ లేకపోవడం కీలకం. మల, మూత్ర విసర్జన వసతుల లేక ముఖ్యంగా విద్యార్థినీలు అవస్థలు పడుతున్నారు.మన ఊరు–మన బడి, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా దండిగా నిధులు రావడంతో మెజార్టీ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. కొన్ని పాఠశాలల్లో ప్రహరీ లేకపోవడం, మరుగదొడ్ల పరిస్థితి అలానే ఉంది. దీంతో బహిర్భూమి కోసం విద్యార్ధినీలు ఇంటికి వెళ్తున్నారు. కనీసం వసతి కూడా లేకపోవడంతో.. పిల్లల్ని సర్కారు స్కూళ్లలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకురావడం లేదు. స్కూళ్లలో విద్యార్ధినీల ఎన్‌రోల్‌మెంట్‌ తగ్గడానికి ఇదే ప్రధాన కారణం. ఇదిలావుంటే.. జిల్లా వ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరం ఆరంభం వరకు ప్రతీ పాశాలలో టాయిలెట్లు నిర్మించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.అయిన ఇప్పటి వరకు మరుగుదోడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. విద్యాశాఖ మాత్రం పనులు యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నట్లు వెల్లడించడం గమనార్హం.72 స్కూళ్లలో ప్రహరీ గోడ నిర్మాణం లేదు. దీంతో.. విద్యార్థినీ, విద్యార్థులకు పిచ్చికుక్కలు.. పందులతో పాటు ఆకతాయిల నుంచి ప్రమాదం పొంచి ఉంది.

స్థానికత ఏది?

ప్రభుత్వ పాఠశాలలు : 651

ఉపవిద్యాధికారుల ఖాళీ : 02

మండల విద్యాధికారుల ఖాళీ : 16

సర్వశిక్షాభియాన్‌ అధికారి : డీఈవో ఇన్‌చార్జి

శిథిలావస్థలో ఉన్న గదులు : 104

మధ్యాహ్న భోజన షెడ్లు అవసరం : 62

ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 2,278 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. సమయపాలన లేమి కారణంగా ప్రభుత్వ పాఠశాలలపై గ్రామాల్లో నమ్మకాలు సన్నగిల్లి ప్రైవేట్‌ పాఠశాలలౖవైపు పిల్లలను పంపేందుకు గ్రామాల్లో ఉత్సాహకత చూపుతున్నారు. పనిచేస్తున్న ఉపాధ్యాయులు పని చేసే చోటే స్థానికంగా ఉంటోన్న వాళ్లు వెయ్యి లోపే. మిగతావాళ్లు రోజు జిల్లా, పట్టణ, మండల కేంద్రం నుంచి స్కూలుకు రోజు వచ్చి వెళ్తున్నారు. మారుమూల ప్రాంతాల బస్సులు మిస్‌ అయితే.. విధులకు ఎగనామం పెట్టే ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నారు. కొందరు మాత్రమే ఎలాగో అలా స్కూలుకు వెళ్తారు. ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ ప్రతిరోజు స్కూళ్లో ప్రార్ధనలో హాజరుకావాలనే ఆదేశాలున్నాయి. అయినా.. చాలా చోట్ల ప్రార్థన తర్వాత కొందరొస్తే.. ఇంకొందరు ఓ పీరియడ్‌ పూర్తయిన తర్వాత వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement