
సాంకేతిక శిక్షణ.. భవితకు నిచ్చెన
● ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
● టైలరింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్లలో 42 రోజులపాటు తర్ఫీదు
● పూర్తి చేసిన 89 మంది పురుషులు, 680 మంది మహిళలు
నప్తగిరికాలనీ(కరీంనగర్): తమ చిన్ననాటి కలలను ఇప్పుడు సాకారం చేసుకుంటున్నాముని కొందరు.. నేర్చుకుంటున్న కళను ఇంకా మెరుగుపర్చుకుందామని మరికొందరు.. స్కూల్లో పిల్ల లకు పెట్టే టాస్క్లో మేము సైతం సాయం చేద్దామని ఇంకొందరు.. ఉపాధి కోసమని.. ఉద్యోగం సాధించాలని.. పది మందికి ఉపాధి కల్పించాలని ఇలా ఎవరికి వారు తమ ఆశయాలు, లక్ష్యం సార్థకం చేసుకునేందుకు సిద్ధమయ్యారు నారీమణులు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ కళలకు వయస్సుతో సంబంధం లేదని కరీంనగర్ మంకమ్మతోటలోని ధన్గర్వాడీ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న సాంకేతిక ఉపాధ్యాయ శిక్షణ కోర్సు(టీటీసీసీ)లో ఉత్సాహంగా పాల్గొన్నారు మహిళలు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సులో పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ పొందారు. 42 రోజులపాటు సాగిన కోర్సు బుధవారంతో పూర్తయింది. ఈక్రమంలో శిక్షణ పొందిన మహిళల అనుభవాలు, భవిష్యత్ కార్యాచరణపై సాక్షి ప్రత్యేక కథనం.
42 రోజుల శిక్షణ
ధన్గర్వాడీ పాఠశాలలో నిర్వహిస్తున్న టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సులో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం, మంచిర్యాల, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల నుంచి 89 మంది పురుషులు, 680 మంది మహిళలు మొత్తం 769 మంది వివిధ కోర్సుల్లో శిక్షణ పొందారు. మే 1న కోర్సు ప్రారంభించగా.. జూన్ 11తో ముగిసింది. టైలరింగ్, డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్లలో 42 రోజులపాటు శిక్షణ పొందారు. 469 మంది డ్రాయింగ్లో, 360 మంది టైలరింగ్, క్రాఫ్ట్లలో శిక్షణ తీసుకున్నారు. శిక్షణ కోర్సు డైరెక్టర్ బొట్ల రామస్వామి పర్యవేక్షణలో టీటీసీసీ శిక్షణ కార్యక్రమాలు పకడ్బందీగా పూర్తయ్యాయి.

సాంకేతిక శిక్షణ.. భవితకు నిచ్చెన