
సంతానం కోసం వెళ్తే ప్రాణమే పోయింది
జగిత్యాలక్రైం: ఆమెకు సుమారు 18 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. సంతానం లేకపోవడంతో పూజలు చేసింది. దేవుళ్లకు మొక్కింది. పలు ఆస్పత్రుల్లోనూ చూపించుకుంది. అయినా పిల్లలు కలగలేదు. చివరి ప్రయత్నంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించగా.. వారు ఆపరేషన్ చేయించుకుంటే పిల్లలు పుడుతారని చెప్పడంతో అమ్మతనం కోసం అంగీకరించింది. అయితే ఆ అమ్మతనం పొందకుండానే సదరు ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేస్తున్న సమయంలో మృతిచెందింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన అయిత గంగాధర్కు అదే గ్రామానికి చెందిన రాజవ్వతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం కాకపోవడంతో పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలికి చూపించుకుంది. వైద్యురాలు గర్భసంచి ఆపరేషన్ చేస్తే పిల్లలు పుడతారని చెప్పడంతో ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ చేస్తుండానే మృతిచెందింది. ఆమె మృతికి వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై గీత ఆస్పత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో శాంతించారు.
పోచంపేటలో విషాదం
రాజవ్వ మృతిచెందడంతో ఆమె గ్రామంలో విషా దం చోటుచేసుకుంది. భర్త గంగాధర్ వ్యవసాయం చేస్తుండగా.. రాజవ్వ బీడీలు చుడుతోంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా నిండు ప్రాణం పోవడంతో గ్రామంలో విషాదం నిండింది.
ఆపరేషన్ వికటించి మహిళ మృతి
వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆందోళన

సంతానం కోసం వెళ్తే ప్రాణమే పోయింది