
రక్తం పంచి.. ఆయువు పెంచి
● రక్తదానానికి ముందుకొస్తున్న యువత ● వాట్సాప్ వేదికగా స్పందిస్తున్న దాతలు ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సం
కరీంనగర్టౌన్: రక్తదానం మహాదానం. ప్రాణా పాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ఆదుకున్న వారు ప్రాణ బఽంధువులే. ఏ బంధం లేకున్నా మానవీయ కోణంలో స్పందించే తీరు ఐక్యతను చాటుతుంది. రోడ్డు ప్రమాదం, క్రిటికల్ డెలివరీ, రక్తహీనత, తలసేమియా, కేన్సర్, శస్త్రచికిత్స ఏదైతేనేం ఆపద సమయంలో రక్తదానం చేసి ఆదుకున్న వారు ఆప్తులకు మించిన వారు. రక్తం అవసరం ఉందనే విషయం వాట్సాప్, వివిధ రకాల సోషల్మీడియా ద్వారా తెలుసుకుని జిల్లాలోని యువత, వివిధ సంఘాల సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు రక్తదాతల దినోత్సవం సందర్భంగా కథనం.
మూడు నెలలకోసారి..
రోడ్డు ప్రమాదాలు, తలసేమిమయా, కేన్సర్, ప్రసవం, శస్త్రచికిత్సల సమయంలో రక్తం అత్యవసరం. జిల్లాలో ఎక్కువగా రోడ్డుమార్గం ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. క్రిటికల్ డెలికవరీలు, తలసేమియా బాధితులు కూడా ఎక్కువే. ఆపదవేళ రక్తలభ్యత సవాలుగా మారుతోంది. 18 నుంచి 65 ఏళ్ల వయసున్న ఆరోగ్యవంతులు మూడునెలలకోసారి రక్తదానం చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఒకవ్యక్తి జీవిత కాలంలో 168సార్లు రక్తదానం చేయవచ్చని సూచిస్తున్నారు. 15 రోజులకోసారి ప్లేట్లెట్లు ఇవ్వొచ్చని, రక్తదానం చేసినప్పుడు ఏర్పడిన నష్టం 4 నుంచి 8 రోజుల్లో భర్తీ అవుతుందని వెల్లడిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల ద్వారా
జిల్లాలో కొందరు సామాజిక బాధ్యతగా రక్తదానం చేస్తూ, చేయిస్తూ ముందుకు సాగుతున్నారు. సా మాజిక మాధ్యమాల ద్వారా బ్లడ్డొనేషన్ ఆర్గనైజేషన్లను నడుపుతున్నారు. నగరంలోని ఆసుపత్రులలో చికిత్స పొందేవారు రక్తం అవసరమైతే ఆర్గనైజర్లను సంప్రదిస్తుండగా, వారు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రి బ్లడ్బ్యాంక్, రెడ్క్రాస్తో పాటు మరో 13 ప్రైవేటు బ్లడ్బ్యాంకుల వద్ద దాతల ఫోన్నంబర్లు అందుబాటులో ఉన్నాయి.