
గుర్తు తెలియని మహిళ మృతి
గోదావరిఖని: స్థానిక ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని మహిళ మంగళవారం మృతి చెందినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. ఆరురోజుల క్రితం గోదావరినది ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తుతెలియని మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మహిళ ఆరోగ్యం క్షీణించి చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపర్చినట్లు వివరించారు. ఫొటోలో ఉన్న మహిళను గుర్తిస్తే 87126 56516 నంబర్కు సమాచారం అందించాలని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి కోరారు.
డాక్టర్ భూంరెడ్డి మృతికి సంతాపం
కొత్తపల్లి(కరీంనగర్): రాజా బహద్దూర్ వెంకటరామరెడ్డి విజ్ఞాన పరిషత్ (రెడ్డి సంక్షేమ సంఘం) ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ వైద్యుడు వి.భూంరెడ్డి మృతికి సీతారాంపూర్లోని ఆర్బీవీఆర్ఆర్లో మంగళవారం సంతాప సభ నిర్వహించి నివాళులర్పించారు. సంఘం అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి, కార్యదర్శి బండ గోపాల్రెడ్డి, కోశాధికారి కాసర్ల మధూకర్రెడ్డి, ఉపాధ్యక్షుడు గన్ను మహేశ్వర్రెడ్డి, సంయుక్త కార్యదర్శి దాసరి రామ్రెడ్డి, కార్యవర్గ సభ్యుడు ఏనుగు చుక్కరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
ఫెర్టిలైజర్సిటీ: గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని గోదావరిఖని నుంచి పోతనకాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై మంగళవారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొన్నది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పలువు రు గాయాలతో బయటపడ్డారు. గోదావరిఖని పోతనకాలనీ ప్రధాన రహదారిపై గడిచిన నాలుగు నెలల్లో రాత్రివేళల్లోనే కార్లు విద్యుత్ స్తంభాలను ఢీకొన్న ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ట్రైనీ ఎస్ఐపై
అట్రాసిటీ కేసు
సైదాపూర్: ట్రైనీ ఎస్ఐ అగస్త్య భార్గవ్పై సైదాపూర్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేస్ నమోదు చేశారు. ఇటీవల భార్గవ్ మండలంలోని సోమారం శివారులో డ్రంకెన్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. గొల్లగూడెంకు చెందిన బత్తుల మహేందర్ మొలంగూర్ నుంచి సైదాపూర్ వస్తుండగా డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేసి కులం పేరుతో దూషించాడు, అంతేకాకుండా అకారణంగా చితకబాధాడు. దీంతో మహేందర్ పోలీసు ఉన్నతాధికారులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాడు. మహేందర్ను చితకబాధిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు విచారణ చేపట్టారు. ట్రైనీ ఎస్ఐ భార్గవ్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ కేస్ నమోదు చేశారు.

గుర్తు తెలియని మహిళ మృతి