కామారెడ్డి క్రైం: అతివేగంగా ప్రయాణించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అతివేగ నియంత్రణ, జిల్లాలోని ఎన్హెచ్–44, ఎన్హెచ్–161 జాతీయ రహదారులపై ఉన్న ఆక్రమణల అంశంపై చర్చించారు. ఆక్రమణల తొలగింపునకు సంబంధించిన ప్రతిపాదనలను నూతనంగా ఏర్పాటు చేసిన హైవే టాస్క్ఫోర్స్ కమిటీ ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఎన్హెచ్–44 లోని సదాశివనగర్ వద్ద జరుగుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను జనవరి నాటికి పూర్తయ్యేలా చూస్తామని జాతీయ రహదారుల అధికారులు తెలిపారు.
ముందస్తు కార్యాచరణతో
సిద్ధంగా ఉండాలి
ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, వివిధ శాఖల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సంగ్వాన్ సమావేశం ఏర్పాటు చేసి ఆయా అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్, వైద్యం, పశుసంవర్ధక, పంచాయతీరాజ్ తదితర శాఖలు తమ కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, డీఆర్డీవో దామోదర్రెడ్డి, డీపీవో మురళి తదితరులు పాల్గొన్నారు.


