కామారెడ్డి టౌన్ : ప్రత్యేక ఓటరు నమోదు (సర్) ప్రక్రియ దరఖాస్తులను ఇంకా సమర్పించని ఓటర్లు ఆగస్టు 1వ తేదీలోపు సంబంధిత అధికారులకు అందజేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రవితేజ తెలిపారు. జిల్లా కేంద్రంలోని 46, 47వ వార్డుల్లో జరుగుతున్న సర్ ఓటరు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. సేకరించిన సర్ ఫారాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. తహసీల్దార్ హిమబిందు, కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణల, ఆర్ఐ ప్రసన్న, జీపీవో సూరజ్, నితీష్, బీఎల్వోలు కాశీరాం, వెంకటలక్ష్మి, రేఖ, బబిత, జమున తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ బూత్లను పరిశీలించిన ఆర్డీవో
నస్రుల్లాబాద్ : మండలంలోని అంకోల్తండాలో గల పోలింగ్ బూత్ను మంగళవారం బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకోల్తండాలో 1200 మంది ఓటర్లకు ఒకే బూత్ ఉందని, మరో పోలింగ్ బూత్ ఏర్పాటుకు నివేదికలు తయారు చేస్తున్నామన్నారు. అనంతరం పాఠశాలలో గల సదుపాయాలను విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. తహసీల్దార్ సువర్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట స్వామి, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
రాఘవపూర్లో వందశాతం ఎస్ఐఆర్ పూర్తి
కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలం రాఘవపూర్ గ్రామంలో మంగళవారం నాటికి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్) వంద శాతం పూర్తయినట్లు సర్పంచ్ ఎడ్ల వినీల నరేష్ తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నరేష్, గ్రామ కార్యదర్శి మాధవిలత, బీఎల్ఓ బలరాం, వీవోఏ లావణ్య తదితరులు పాల్గొన్నారు.


