● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● జనగణన హ్యాండ్బుక్ తయారీపై శిక్షణ
కామారెడ్డి క్రైం : జిల్లా జనగణన హ్యాండ్బుక్ తయారీలో కచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో క్షేత్రస్థాయి సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హ్యాండ్బుక్ తయారీ ప్రక్రియలో ప్రతి దశను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. సమాచార సేకరణలో నాణ్యత, కచ్చితత్వం, పారదర్శకతను పాటించాలని ఆదేశించారు. జిల్లా సామాజిక, ఆర్థిక, భౌగోళిక, పరిపాలనా వివరాలకు ప్రామాణిక ఆధార గ్రంథంగా హ్యాండ్బుక్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి సమాచారాన్ని సంబంధిత రికార్డులతో సరిపోల్చి, పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలన్నారు. మార్గదర్శకాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) విక్టర్, హైదరాబాద్కు చెందిన జనగణన అధికారి రమణ, సీపీవో రఘునందన్, సూపరింటెండెంట్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
జిల్లాను 2030 నాటికి టీబీ (క్షయ) రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ప్రతి మండలంలో టీబీ నిర్మూలన కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేకాధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న గ్రామాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గిరి, డీఆర్డీవో దామోదర్ రెడ్డి, డీఎంహెచ్వో వెంకట్, ప్రోగ్రాం అధికారులు ప్రదీప్, రాజు, రోహిత్ కుమార్, డీఈవో మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.


