● వీసీలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
కామారెడ్డి క్రైం : ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సూచించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఆర్డీవో, జెడ్పీ సీఈవో, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా గ్రామాల్లో ఇంకుడు గుంతలు, ఊట కుంటలు, పంట కుంటలు, బోరు బావుల రీచార్జ్ ఫిట్ల నిర్మాణాలు విరివిగా చేపట్టి కూలీలకు పని కల్పించాలన్నారు. గ్రామసభలను నిర్వహిస్తూ పనుల ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. ఆగస్టు 15 నాటికి అన్ని గ్రామాలలో పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. ‘జలసిరి’ పనుల పరిశీలనకు మండల స్థాయిలో గ్రామీణ నీటి సరఫరా ఏఈ, పంచాయతీరాజ్ ఏఈ, ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవోలతో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. వన మహోత్సవంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటించాలని దిశా నిర్దేశం చేశారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గిరి, జెడ్పీ సీఈవో చందర్, డీఆర్డీవో దామోదర్ రెడ్డి, డీపీవో మురళి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


