● యజమానుల సమస్యలను
పారదర్శకంగా పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు, మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పరిధిలో చేపడుతున్న భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. పట్టణంలోని కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూసేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భూ యజమానుల సమస్యలను చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, నీటిపారుదల, రెవెన్యూ, భూసేకరణ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ సాగుపై అవగాహన కల్పించాలి
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల లభ్యతలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల్లో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో వెంటనే నిర్ధారించి అప్డేట్ చేయాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గిరి, డీఏవో మోహన్ రెడ్డి, జిల్లా సహకార అధికారి రామ్మోహన్. మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ క్రాంతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


