● గో సంరక్షణ గొప్పదనాన్ని ప్రకటించేందుకే
వేంకటేశ్వరుడి అవతరణ
● ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గోవు లేకుండా సనాతన ధర్మమే లేదని ప్రముఖ ప్రవచనకర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సమస్త భూతాలకు పరదేవత గోవు అని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇందూరు గోసేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ‘గోమాత వైభవం’ కార్యక్రమంలో మాట్లాడారు. కలియుగంలో గో సంరక్షణ ప్రాధాన్యతను ప్రకటించేందుకే వేంకటేశ్వరుడు అవతరించాడని చెప్పారు. గో సంరక్షణ చేసే వారికి ఆయన ప్రసన్నుడవుతారని వివరించారు. ధర్మం, దైవం, గోవు ఈ మూడు ఒక్కటేనని చెప్పారు. శైవం, వైష్ణవం, శాక్తేయం, కౌమారం తదితర ఆరాధకులు ఎవరైనా అందరికీ గోమాతే ప్రధానమని చెప్పారు. ధర్మపురి శేషప్ప కవి తన పద్యాల్లో గోవు గొప్పతనాన్ని చెప్పిన అంశాలను వివరించారు. ఆవు నెయ్యి, పాలు, పెరుగు లేకుండా యజ్ఞం, యాగం ఉండదని చెప్పారు. సనాతన ధర్మంలో వేదాలు, ఉపనిషత్తులతోపాటు పంచమ వేదమైన భారతంలో గోవు ప్రాముఖ్యతను వివరించారని చెప్పారు. గోవులను రక్షించుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ కూరగాయల ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.


