● బీజేపీ జిల్లా అధ్యక్షుడు
నీలం చిన్న రాజులు
● జిల్లా కేంద్రంలో
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం
కామారెడ్డి టౌన్ : నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆందోళనల ముసుగులో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, దేశ వ్యతిరేక శక్తులు దేశంలో అశాంతి నెలకొల్పాలని చూస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా చిన్నరాజులు మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతో దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ పార్లమెంట్, ప్రధానమంత్రి నివాస ముట్టడికి యత్నించడాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో అసలు నీట్ విద్యార్థులకంటే అల్లరిమూకలు, బీజేపీ వ్యతిరేకులే ఉన్నారన్నారు. ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామన్న ఆలోచనను రాహుల్ గాంధీ విరమించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు నరేందర్రెడ్డి, శ్రీకాంత్, లక్ష్మారెడ్డి, వంశి, మధు, భరత్, సుజిత, ప్రీతి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.


