వరండాలోనే చదువుతున్నాం
గదులు లేవు
మద్నూర్(జుక్కల్): మండలంలోని సుల్తాన్పేట్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు బోధన జరుగుతుంది. విద్యార్థుల కోసం తరగతి గదులు ఉన్నాయి. పాఠశాలలో కేవలం ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. దీంతో ఆ ఉపాధ్యాయుడు ఒకటి తరగతి నుంచి ఐదవ తరగతి వరకు 64 మంది విద్యార్థులను ఒకే గదిలో ఉంచి పాఠాలు చెబుతున్నారు. దీంతో విద్యార్థులు సరిగ్గా చదువలేకపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లచ్చన్ ప్రాథమికోన్నత పాఠశాలలో..
ఆ పాఠశాలలో కావాల్సినంత ఉపాధ్యాయులు ఉన్నారు. తరగతి గదులు సరిపడా లేవు. మండలంలోని లచ్చన్ ప్రాథమికోన్నత పాఠశాలలో 123 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధన కొనసాగుతుంది. పాఠశాలలో ఎనిమిది మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఎనిమిది తరగతులకు నాలుగు గదులు ఉండటంతో విద్యార్థులకు నిత్యం ఆరు బయట, వరండాలో కూర్చొబెట్టి చదువు చెబుతున్నారు.
మండలంలోని పాఠశాలలను పర్యవేక్షించి సమస్యలను తీర్చాల్సిన సంబంధిత అధికారి పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
నిత్యం వరండాలోనే కూర్చొని చదువుతున్నాం. ఉపాధ్యాయులు పాఠాలు ఆరుబయటనే బోధిస్తున్నారు. పాఠశాలలో గదుల కొరత ఉంది. అధికారులు స్పందించాలి.
–రమ్యశ్రీ, 4వ తరగతి, లచ్చన్
స్కూల్లో సరిపడా గదులు లేక రోజు ఇబ్బందులు పడుతున్నాం. పాఠశాలలో తరగతి గదులు నాలుగే ఉన్నాయి. తరగతులు పాఠశాల బయటే జరుగుతున్నాయి.
–దుర్గ, 4వ తరగతి, లచ్చన్
సుల్తాన్పేట్ ప్రాథమిక పాఠశాలలో
64 మంది విద్యార్థులకు ఒకే క్లాస్ రూం
లచ్చన్లో గదులు సరిపోక
వరండాలో చదువులు
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు


