ఏర్పాట్లు పూర్తిచేశాం
● రేషన్ బియ్యం పంపిణీకి సన్నద్ధం
● ఆగస్టు 1 నుంచి లబ్ధిదారులకు
అందజేత
ఎల్లారెడ్డిరూరల్ : వాతావరణ పరిస్థితులు, సరఫరా నిర్వహణను దృష్టిలో ఉంచుకొని మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులు, లబ్ధిదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ చేయాలని ఇటీవల కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. గత ఏప్రిల్ నెలలో వేసవి తీవ్రత నేపథ్యంలో లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలల బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
19 వేల మెట్రిక్ టన్నుల బియ్యం
జిల్లాలోని 577 రేషన్ దుకాణాల పరిధిలో 2 లక్షల 76 వేల 471 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. మొత్తం 9 లక్షల 56 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. అంత్యోదయ కార్డులు 17, 815 ఉండగా 52,531 మంది, అన్నపూర్ణ కార్డులు 825 ఉండగా 865 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల 6,637 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేస్తారు. ప్రస్తుతం మూడు నెలలకు సంబంధించి 19 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్దుకాణాలకు సరఫరా చేయనున్నారు.
ఎల్లారెడ్డి గోదాం పరిధిలో ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాలకు సంబంధించి 79 రేషన్ దుకాణాలు ఉన్నాయి. మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీకి అలాట్మెంట్ రాగానే ప్రారంభిస్తాం. ఆగస్టు 1 నుంచి లబ్ధిదారులకు మూడు నెలల బియ్యం అందజేస్తాం.
– వంశి, డీటీ, సివిల్ సప్లయ్, ఎల్లారెడ్డి


