కామారెడ్డి టౌన్ : పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్యసేవలు మరింత చేరువ కావాలని డీఎంహెచ్వో వెంకట్ వైద్యాధికారులు, వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బస్తీ, యూపీహెచ్సీ వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, క్షయ, మాతాశిశు సంరక్షణ, టీకా కార్యక్రమాల అమలు తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. గర్భిణుల నమోదు, ప్రసవ పూర్వ పరీక్షలు, డెలివరీ ప్లాన్, ప్రసవాలు, ప్రసవానంతరం సంరక్షణ వంటి అంశాలపై సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వో రాజు, ప్రోగ్రాం అధికారులు ప్రదీప్, వెంకటస్వామి, ఎపిడెమియాలజిస్ట్ మోనిక, వైద్యాధికారులు మహేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, చలపతి, సిద్ధిరామేశ్వర్, అశ్విని పాల్గొన్నారు.


