పల్లెల్లో చైతన్యం! | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో చైతన్యం!

Jul 21 2026 1:18 AM | Updated on Jul 21 2026 1:18 AM

పల్లెల్లో చైతన్యం!

జిల్లాలో ఎన్యుమరేషన్‌ ప్రక్రియకు సంబంధించిన వివరాలు..

సర్‌కు సహకరిస్తున్న ఓటర్లు

96 పోలింగ్‌ బూత్‌లలో

నూరు శాతం డిజిటలైజేషన్‌

ఆదర్శంగా నిలుస్తున్న గ్రామీణ ఓటర్లు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పట్టణ ఓటర్లకన్నా గ్రామీణ ఓటర్లు ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందుంటారు. ఎన్నికలు జరిగిన ప్రతీసారి పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటుండడం గమనిస్తుంటాం. ఇప్పుడు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లోనూ గ్రామీణ ఓటర్లు అంతే ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జిల్లాలోని జుక్కల్‌, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలో 796 పోలింగ్‌ బూత్‌లు ఉండగా ఇప్పటికే 96 బూత్‌లలో వంద శాతం ఎన్యుమరేషన్‌ ఫారాల(ఈఎఫ్‌)ను పూరించడంతోపాటు డిజిటలైజ్‌ ప్రక్రియ పూర్తవడం గమనార్హం. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటర్లు ఉత్సాహంగా బీఎల్‌వోల దగ్గరకు వెళ్లి మరీ తమ ఫారాలను నింపిస్తున్నారు. జిల్లాలో త్వరగా నూరు శాతం ఎన్యుమరేషన్‌ జరగాలన్న లక్ష్యంతో కలెక్టర్‌ ఆశీష్‌ సంగ్వాన్‌ నిరంతరం అధికారులతో సమీక్షిస్తున్నారు. మండలాల వారీగా, గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండడంతో ప్రక్రియ వేగంగా సాగుతోంది.

ఏ ఏ బూత్‌లలో పూర్తయ్యిందంటే..

జుక్కల్‌ నియోజకవర్గంలోని మద్నూర్‌ మండలం సోమూర్‌ గ్రామంలోని పోలింగ్‌ బూత్‌లో 536 మంది ఓటర్లు ఉండగా 533 మందికి సంబంధించి ఎన్యుమరేషన్‌ ఫారాలను డిజిటలైజ్‌ చేశారు. మిగతా ముగ్గురు స్థానికంగా లేకపోవడం, ఓటు షిఫ్ట్‌ కావడం, చనిపోవడం వంటి కారణాలతో వాటిని మినహాయించారు. ఇదే మండలంలోని పిప్పిరిగడి తండాలో 152 మంది ఓటర్లకు గాను 149 మంది ఈఎఫ్‌ ప్రక్రియ పూర్తయ్యింది.

కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం అక్కాపూర్‌లో 1,217 మందికిగాను 1,187 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్‌ చేశారు. మిగతా 30 మంది ఓటర్లు చనిపోవడం, ఇతర ప్రాంతాలకు ఓటు బదిలీ కావడం వంటి కారణాలతో మినహాయించారు. ఇదే మండలంలోని రాజఖాన్‌పేటలో 555 మంది ఓటర్లకు గాను 520 మంది వివరాలు డిజిటలైజ్‌ అయ్యాయి.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం తిప్పారంలో 895 మంది ఓటర్లకుగాను 828 మంది ఓటర్ల ఎన్యుమరేషన్‌ ఫారాలను పూరించారు. చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు ఓటు బదిలీ చేసుకున్నవారు, స్థానికంగా లేకపోవడం వంటి కారణాలతో మిగతావాటిని తొలగించారు. ఇదే మండలంలోని బూర్గుల్‌లో 1,246 మంది ఓటర్లకు గాను 1,166 మంది ఓట్లు డిజిటలైజ్‌ అయ్యాయి. వివిధ కారణాలతో మిగతావాటిని పక్కన పెట్టారు. ఇలా మొత్తం 96 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో ఎన్యుమరేషన్‌ పత్రాలను పూరించడంతోపాటు డిజిటలైజ్‌ చేయడం పూర్తయ్యిందని అధికారులు తెలిపారు.

నియోజకవర్గం పోలింగ్‌ బూత్‌లు మొత్తం ఓటర్లు ఈఎఫ్‌ పత్రాల డిజిటలైజేషన్‌ శాతం

పంపిణీ శాతం

జుక్కల్‌ 255 2,06,343 100 1,74,882 84.75

ఎల్లారెడ్డి 274 2,28,503 100 1,95,900 85.73

కామారెడ్డి 267 2,61,160 100 1,95,637 74.91

మొత్తం 796 6,96,006 100 5,66,419 81.38

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement