● మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్
● నిమ్స్లో బాధితులకు పరామర్శ
బాన్సువాడ : బాన్సువాడ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిలో బాలింతలు అస్వస్థతకు గురైన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్న బాలింతలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ ఎంసీహెచ్లో సిజేరియన్ వికటించి ఐదుగురు బాలింతలు తీవ్ర అస్వస్థతకు గురైతే ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి విచారణ జరపకపోవడం శోచనీయమన్నారు. ఓ బాలింతను నిజామాబాద్లోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్తే రూ.3 లక్షలు ఖర్చయ్యాయని, వైద్యం కోసం మెడలో ఉన్న పుస్తెల తాడును అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బాలింతలు ఒకచోట, వారి పిల్లలు మరోచోట ఉండాల్సి వస్తోందని పేర్కొన్నారు. పిల్లలకు సైతం ఇన్షెక్షన్ సోకిందని తల్లులు చెబుతున్నారని, దీనిపై వెంటనే విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్, బీఆర్ఎస్ నాయకులు సాయిబాబా తదితరులున్నారు.


