త్వరలో కేకేవై రోడ్డుకు మహర్దశ | - | Sakshi
Sakshi News home page

త్వరలో కేకేవై రోడ్డుకు మహర్దశ

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు

లింగంపేట: కరీంనగర్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి(కేకేవై) రోడ్డుకు త్వరలో మహర్దశ రాబోతోందని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. ఆదివారం పొల్కంపేట చౌరస్తాలోని ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేకేవై రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ఫైల్‌ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వద్ద ఉందన్నారు. త్వరలో నిర్మాణానికి అనుమతులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ ద్వారా కాటేవాడి, మోతె, ధర్మరావుపేట, గుర్జాల్‌ ప్రాంతాల్లో మినీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు.

ప్లాస్టిక్‌ నిషేధం బాధ్యత సర్పంచులదే..

గ్రామాల్లో ప్లాస్టిక్‌ను నిషేధించే బాధ్యత సర్పంచులదే అని ఎమ్మెల్యే అన్నారు. ఈ విషయంలో ప్రతి గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేయాలని సూచించారు. అలాగే గ్రామాల్లో ఐస్‌క్రీములు విక్రయించకుండా చూడాలన్నారు. ఐస్‌క్రీములు విక్రయిస్తే రూ. 3 వేలు జరిమానా విధించాలని ఆదేశించారు. ప్లాస్టిక్‌ నిషేధంపై అధికారులు, నాయకులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పలువురికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ప్రత్యూష, సాయిరాం, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రజిత, డీఆర్‌డీవో సురేందర్‌, ఆర్డీవో ప్రభాకర్‌, తహసీల్దార్‌ సురేష్‌, ఎంపీడీవో నరేష్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ దశరథ్‌నాయక్‌, నాయకులు నారాగౌడ్‌, శ్రీనివాస్‌, రాజు, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement