కామారెడ్డి అర్బన్: దేశ, ధర్మ రక్షణలో ప్రతి ఒక్కరు ముందుండాలని కామారెడ్డి పాతరాజంపేటలోని ఆర్ష గురుకుల అధిపతి స్వామి బ్రహ్మానంద సరస్వతి సూచించారు. గురుకులంలో నిర్వహించిన యువ నిర్మాణ ఆర్యవీర్ దళ్ పది రోజుల శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా బ్రహ్మానంద సరస్వతి మాట్లాడుతూ ప్రస్తుతం గురుకుల విద్యావ్యవస్థ లేకపోవడంతో విలువలు, జీవన ప్రయోజనం లేని విద్యతో సమాజం తప్పుదోవలో నడుస్తోందన్నారు. ప్రతి విద్యార్థి మాతృ, పితృ, గురు, దైవ, దేశభక్తి కలిగి ఉండాలన్నారు. స్వీయరక్షణ, దేశ రక్షణ కోసం కర్రసాము, కత్తిసాము, ఆసనాలు నేర్చుకోవాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు శిక్షణలో పాల్గొన్నారు. దేశ, ధర్మాల రక్షణకు కట్టుబడి ఉంటామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేయించారు. శిబిరంలో పాల్గొన్నవారికి పతకాలు, ప్రశంస పత్రాలు అందించారు. ఈ సందర్భంగా శిక్షార్థుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆచార్యులు సందీప్ ఆర్య, వేదమిత్ర వేదార్థి ఆర్య, హరిదాస్ ఆర్య, సూర్యప్రకాశ్, సుదర్శన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


