సన్న బియ్యానికీ పురుగులు..
టెండర్లు ఆహ్వానించాం
ఎల్లారెడ్డి: రాష్త్రంలో రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది అవుతోంది. గతేడాది ఏప్రిల్ 1న లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. కాగా అప్పటికే రేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లు, గోదాముల్లో 11,124 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. ఇందులో జిల్లాలోని 579 రేషన్ దుకాణాల్లో 695 మెట్రిక్ టన్నులు, ఎంఎల్ఎస్ పాయింట్లలో 1,629 మెట్రిక్ టన్నులు, సివిల్ సప్లైస్ గోదాములలో 8,800 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం ఉన్నాయి. ఒకటి రెండు నెలల్లో దొడ్డు బియ్యాన్ని తీసుకుపోతామన్న అధికారులు ఏడాది కావస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో దొడ్డు బియ్యం పురుగులు పట్టి, ముక్కిపోతున్నాయి. ఇటీవల దొడ్డు బియ్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. అయితే కిలో ధర రూ. 24గా పేర్కొనడంతో కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. తర్వాత ధర రూ.2 తగ్గించినా అదే పరిస్థితి ఉంది.
నిల్వ చేయడానికి స్థలం లేక..
రేషన్ దుకాణాలలో దొడ్డు బియ్యం ఉండడంతో ప్రతినెలా వస్తున్న కోటాను నిల్వ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈసారి మూడు నెలల కోటా వస్తుండడంతో దానిని ఎక్కడ నిల్వ చేయాలో తెలియడం లేదని డీలర్లు పేర్కొంటున్నారు. త్వరగా దొడ్డు బియ్యం తీసుకువెళ్లాలని పౌరసరఫరాల శాఖ అధికారులను కోరుతున్నారు.
దొడ్డు బియ్యం కారణంగా సన్న బియ్యానికీ పురుగులు పడుతున్నాయని రేషన్ డీలర్లు పేర్కొంటున్నారు. గతంలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసిన కందిపప్పు కొనుగోలు చేయడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపలేదని, దీంతో అవి పురుగులు పట్టి పాడైపోతే బయట పారబోశామని తెలిపారు. పారబోసిన కొద్ది రోజులకే సివిల్ సప్లై అధికారులు పప్పును స్వాధీనం చేయాలని ఒత్తిడి తెచ్చారన్నారు. దీంతో మార్కెట్లో కందిపప్పు కొని పౌరసరఫరాల శాఖకు అప్పగించాల్సి వచ్చిందంటున్నారు. ఇప్పుడు చెడిపోయిన బియ్యాన్ని కూడా పారబోస్తే మళ్లీ తమ బియ్యం తమకు ఎక్కడ ఇవ్వమంటారోనని దుకాణాల్లోనే స్టాక్ పెట్టుకుంటున్నామని చెబుతున్నారు.
ఏడాదిగా రేషన్ దుకాణాలు,
ఎంఎల్ఎస్ పాయింట్లలోనే..
తరలించడంలో
పాలకుల నిర్లక్ష్యం
ఇబ్బందిపడుతున్న రేషన్ డీలర్లు
రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లు, గోదాముల్లో మిగిలిపోయిన దొడ్డు బియ్యం నిల్వల కొనుగోలు కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. మొదటిసారి టెండర్లలో కిలో దొడ్డు బియ్యానికి 24 రూపాయలని ప్రకటించింది. ఎవరూ ముందుక రాకపోవడంతో ధర తగ్గించి కిలో 22 రూపాయల చొప్పున రీ టెండర్ ప్రకటించాం. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, దొడ్డు బియ్యం నిల్వలను తరలిస్తాం.
– శ్రీకాంత్, డీఎం, సివిల్ సప్లైస్, కామారెడ్డి


