కామారెడ్డి టౌన్ : జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమీక్ష (ఎస్ఐఆర్–2025) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల నమోదు, వర్గీకరణ, ధ్రువీకరణ చర్యల్లో రాజకీయ పార్టీల సహకారం కీలకమన్నారు. ఓటర్లను వయస్సు, పాత జాబితాల ఆధారంగా ఏ, బీ, సీ, డీ అనే నాలుగు ప్రధాన వర్గాలుగా విభజించినట్లు ఆయన వివరించారు. 39 ఏళ్లు పైబడి 2002 సంవత్సరం ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవారు, లేనివారు, అలాగే 21 నుంచి 38 ఏళ్ల మధ్య వయసువారు, 18 నుంచి 20 ఏళ్ల యువ ఓటర్ల వివరాలను పక్కాగా సేకరించాలని అధికారులకు సూచించారు. డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి పేర్లను తొలగించి, తప్పుల్లేని జాబితా సిద్ధం చేయాలన్నారు. రాజకీయ పార్టీలు తమ బూత్ స్థాయి ఏజెంట్లను వెంటనే నియమించుకుని ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో గిరి, ఎన్నికల విభాగం అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆన్లైన్ పోర్టల్ ద్వారానే ఇసుక సరఫరా
కామారెడ్డి టౌన్ : జిల్లాలో ఇసుక సరఫరాను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఇసుక –మన వాహనం’ ఆన్లైన్ పోర్టల్ సేవలను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సంగ్వాన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెర్స్ సహకారంతో తహసీల్దార్లు, ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులకు ఈ పోర్టల్పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి స్థానిక అవసరాలకు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కావాల్సిన వారు కచ్చితంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనుమతులు పొందిన వినియోగదారులకే ఇసుక సరఫరా జరుగుతుందని, దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి సమయానికి ఇసుక అందుతుందని పేర్కొన్నారు. మైనింగ్ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.


