నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించడంపై శనివారం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన విద్యార్థిని ఇటీవల నీటి ట్యాంకు ఎక్కి ఆత్మహత్యకు యత్నించగా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ట్యాంకు ఎక్కి విద్యార్థిని రక్షించారు. అనంతరం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ సోషల్ వర్కర్ వీణ, పృథ్వి బాధిత యువతితో మాట్లాడి వివరాలు సేకరించారు. తమది పేద కుటుంబం కావడంతోపాటు నాయక్పోడ్ కులధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు చదువు వద్దని వారించారన్నారు. దాంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని విద్యార్థిని అధికారులకు వివరించినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
సదాశివ నగర్(ఎల్లారెడ్డి): మండలకేంద్రం శివారులోని 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. మండలంలోని కల్వరాల్ గ్రామానికి చెందిన ఓ ముస్లిం కుటుంబం శనివారం ఆటోలో కామారెడ్డికి బయలుదేరింది. సదాశివనగర్ శివారులోని హైవేపై వారి ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యా యి. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.


