ఆర్మూర్టౌన్: ఆలూర్ మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లో చొరబడిన దొంగలు 10 తులాల బంగారం, రూ.2 లక్షల నగదును అపహరించారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఆలూర్ మండల కేంద్రానికి చెందిన త లారి జమున ఈ నెల 15న ఇంటికి తాళం వేసి జుక్కల్లో ఉంటున్న తన చిన్న కుమారుడు ఇంటికి వెళ్లింది. కాగా, శుక్రవారం ఉదయం ఇంటి తలుపు లు తెరిచి ఉండటాన్ని గమనించిన కాలనీవాసులు జమునకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆలూర్కు చేరుకున్న జమున ఇంట్లోని వస్తువులు చిందరవందరగా కనిపించడంతో ఆందోళనకు గురైంది. దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాను ధ్వంసం చేసి బంగారు ఆభరణాలతోపాటు నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ చోరీ జరిగిన తీరును పరిశీలించారు. గురువారం రాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడి ఉంటారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కారు అద్దాలు ధ్వంసం చేసి..
బోధన్టౌన్(బోధన్): కారు అద్దాలు పగులగొట్టి రూ.3 లక్షలు చోరీ చేసిన ఘటన బోధన్ పట్టణంలోని గోశాల రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం. సాలూర మండలంలోని జాడీ జమాల్పూర్ గ్రామానికి చెందిన హరిబాబు భూమి కొనుగోలు కోసం చెల్లించాల్సిన డబ్బులను డ్రా చేసుకోవడానికి రాకాసీపేట్లోని కెనరా బ్యాంక్కు వెళ్లాడు. బ్యాంకులోకి వెళ్లి రూ. 3 లక్షలు డ్రా చేసి తిరిగి గోశాల రోడ్డులోని యూనియన్ బ్యాంక్ ఎదుట కారును పార్కు చేశాడు. డ్రా చేసిన రూ. 3 లక్షలు కారులో పెట్టి, మరికొన్ని డబ్బులు డ్రా చేసుకోవాడనికి యూనియన్ బ్యాంకులోకి వెళ్లి తిరిగి కారు వద్దకు వచ్చాడు. కారు అద్దాలు పగిలి ఉండటంతోపాటు అందులోని రూ. 3 లక్షలు కనిపించక పోవడంతో బాధితుడు ఆందోళనకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట నారాయణ వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా ఆలూర్లో
10 తులాల బంగారం,
రూ.2 లక్షల నగదు అపహరణ
బోధన్లో కారులో నుంచి సినీ ఫక్కీలో రూ.3లక్షల దొంగతనం


