● పర్యాటకులకు సౌకర్యంగా
‘నిజాంసాగర్’ టూరిజం పనులు
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
నిజాంసాగర్(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయించి, ఇళ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో జాప్యానికి తావులేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు జరిగేలా హౌసింగ్ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. శుక్రవారం జుక్కల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాలు, ఆక్సిజన్ పార్క్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్తోపాటు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. ఆక్సిజన్ పార్క్లో అభివృద్ది పనులు పూర్తి చేసి, వృక్షాల సంరక్షణతో పాటు ప్రజల కు కావాల్సిన సదుపాయాలు కల్పించాలన్నారు. కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారివెంట హౌసింగ్ పీడీ విజయ్పాల్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, డీఈవో రాజు, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
పర్యాటకులకు సౌకర్యంగా టూరిజం పనులు
రానున్న వర్షాకాలం నాటికి నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఎకోటూరిజం అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టు గోల్ బంగ్లా వద్ద ఎకోటూరిజం పనులను ఆయన పరిశీలించారు. డిలక్స్ కాటేజీలు, షూట్ కాటేజీలు, రెస్టారెంట్ బ్లాక్ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయనవెంట నీటిపారుదలశాఖ ఈఈ సోలోమాన్, ఎంపీడీవో శివకృష్ణ, తహసీల్దార్ భుజంగరావు తదితరులు ఉన్నారు.


