గడువులోగా పనులు పూర్తిచేయాలి
● అధికారులు సమన్వయంతో
పనిచేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్: జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేయకుండా, నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ఆయన అదనపు కలెక్టర్ మధుమోహన్తో కలిసి విద్యా, శిశుసంక్షేమ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నిర్మిస్తున్న మరుగుదొడ్ల స్థితిగతులపై చర్చించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తాగునీటి సదుపాయం, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న వరద నివారణ పనుల్లో నాణ్యత పాటించాలని, కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీఆర్డీవో సురేందర్, డీడబ్ల్యూవో ప్రమీల, డీఈవో, డీపీవో, ఆయా శాఖల ఆధికారులు పాల్గొన్నారు.


