రేషన్ పంపిణీలో పారదర్శకత ఉండాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకత ఉండాలని డీలర్లకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మండలంలోని తిర్మన్పల్లి గ్రామాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. రేషన్ దుకాణంతోపాటు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను, ఉపాధిహామీ పనులను ఆయన పరిశీలించారు. రేషన్ షాపులో బియ్యం నిల్వలు, పంపిణీ విధానం, స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో నిర్లక్ష్యం పనికి రాదని అన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రగతిపై ఆరా తీశారు. వంద శాతం హాజరు ఉన్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు. సమయపాలన పాటించాలని, విద్యార్థుల ప్రగతికి మరింత కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. పిల్లలతోపాటు గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తున్న తీరును తెలుసుకున్నారు.అనంతరం గ్రామ పరిధిలో చేపడుతున్న ఉపాధిహామీ పనులను పరిశీలించారు. కూలి గిట్టుబాటు అవుతుందా అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ శివార్లలో జరుగుతున్న కాంటూరు కందకాల తవ్వకాలు భూగర్భ జల మట్టాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు. పనుల నాణ్యత, కొలతలు, సాంకేతిక ప్రమాణాల అమలు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో సురేందర్, డీపీఎం శ్రీకాంత్, ఐసీడీఎస్ డీబ్ల్యూ వో ప్రమీల, ఎంపీడీవో సంతోష్కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, సర్పంచ్ లాల్సింగ్, మాజీ సర్పంచ్ మధుసూదన్రావు, ఉప సర్పంచ్ రమేశ్రెడ్డి, భాస్కర్ రెడ్డి, అంగన్వాడీ సూపర్ వైజర్ పద్మ తదితరులు ఉన్నారు.
ప్రజాపంపిణీ వ్యవస్థను
నిర్లక్ష్యం చేయొద్దు
భూగర్భ జలాల పెంపునకు
కృషి చేయాలి
ప్రతి కూలీకి వంద రోజుల
పని కల్పించాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
తిర్మన్పల్లిలో సుడిగాలి పర్యటన


