రాకాసి కంపెనీలొద్దు
న్యూస్రీల్
గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026
– 9లో u
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/భిక్కనూరు : ‘‘కెమికల్, ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నం. అలాంటి మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మా బతుకులు నాశనం అవుతాయి. కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలు మాకొద్దు’’ అంటూ భిక్కనూరు మండలంలోని భిక్కనూరు, కాచాపూర్, పెద్దమల్లారెడ్డి, అయ్యవారిపల్లి, మల్లుపల్లి, రామేశ్వర్పల్లి, బస్వాపూర్ తదితర గ్రామాల ప్రజలు నినదించారు. భిక్కనూరు మండల కేంద్ర శివారులో ఏర్పాటు చేస్తున్న మెన్సర్స్ ఫ్యూజన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (బల్క్ డ్రగ్) కంపెనీకి సంబంధించి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. అదనపు కలెక్టర్ విక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారి లక్ష్మీప్రసాద్, కామారెడ్డి ఆర్డీవో వీణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు భిక్కనూరు మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 11 గంంటలకు ప్రారంభమైన సభ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. ప్రజాభిప్రాయ సేకరణలో లాయర్స్ ఫోరం ప్రతినిధులు, ఆయా గ్రామాలకు చెందినవారు, సామాజిక కార్యకర్తలు మాట్లాడారు. సభలో మాట్లాడిన 39 మంది ప్రతినిధులు ఫార్మా ఫ్యాక్టరీ ఏర్పాటును ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఇప్పటికే ఉన్న కంపెనీలు వెదజల్లుతున్న కాలుష్యంతో పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ఉద్యోగాల ఆశ చూపి ఫ్యాక్టరీలు పెడుతూ నీరు, గాలి, నేల కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. భిక్కనూరు మండలంలో ఉన్న ఫ్యాక్టరీలు వెలువరిస్తున్న విష వాయువులతో ఎంతో మంది ఆరోగ్యం దెబ్బతిందన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో ఎన్నో చెబుతారని, తర్వాత ఫ్యాక్టరీలోకి అడుగు పెట్టనివ్వరని పేర్కొన్నారు. చూస్తూచూస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకోబోమని స్పష్టం చేశారు. ప్రజలందరూ వద్దంటున్నా ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు ఇస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని, లేనిపక్షంలో పనులను అడ్డుకుంటామని పేర్కొన్నారు. సభకు హాజరైన వేలాది మంది ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయవద్దంటూ నినాదాలు చేశారు.
ఇప్పటికే ఉన్న ఫ్యాక్టరీలతో
అనారోగ్యం పాలవుతున్నాం
కొత్తగా ఫార్మా కంపెనీని
ఏర్పాటు చేస్తే ఊరుకోం
ప్రజాభిప్రాయ సేకరణలో స్పష్టం చేసిన భిక్కనూరు మండల ప్రజలు
రాకాసి కంపెనీలొద్దు


