మందుల కోసం వెళ్లి మృత్యువాత
మృత్యువులోనూ వీడని బంధం
● ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్..
ఇద్దరి మృతి
● లచ్చాపేటలో విషాదఛాయలు
మాచారెడ్డి: మందుల కోసం వెళ్లిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురై అనంత లోకాలకు చేరారు. ఈ ఘటన గురువారం మాచారెడ్డి మండలం లచ్చాపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లచ్చాపేట గ్రామానికి చెందిన జక్కుల సాయి (22), మిరుదొడ్డి అజయ్ (22) ప్రాణ స్నేహితులు. సాయి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. నాలుగు రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యాడు. మందులు అయిపోవడంతో స్నేహితుడు అజయ్కు ఫోన్ చేసి రమ్మన్నాడు. ఇద్దరు కలిసి బైక్పై గజ్యానాయక్ తండా చౌరస్తాకు వెళ్లి మందులు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వీరి బైక్ లచ్చాపేట స్టేజీ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ ఇద్దరిని 108 అంబులెన్సులో కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.
మృతులు సాయి, అజయ్ ప్రాణ స్నేహితు లు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని గ్రామస్తులు తెలిపారు. ఇద్దరూ రోడ్డు ప్రమాదానికి గురై ఒకేసా రి మృత్యువాత పడడంతో గ్రామస్తులు తీవ్ర ఆవే దనకు లోనయ్యారు. చేతికి అందిన కొడుకులు మృతిచెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడు జక్కుల సాయికి తల్లిదండ్రులు లక్ష్మి, ఎల్లయ్యలతోపాటు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మరో మృతుడు మిరుదొడ్డి అజయ్కు సైతం తల్లిదండ్రులు లక్ష్మి, నరసింహులుతోపాటు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మాచారెడ్డి ఎస్సై అనిల్ కేసు నమోదు చేసుకున్నారు.
మందుల కోసం వెళ్లి మృత్యువాత


