
పశువైద్యశాలలో మందుల కొరత
మందులు అందుబాటులో లేవు
మద్నూర్(జుక్కల్): మద్నూర్ ఉమ్మడి మండలంలోని పశువైద్యశాలలో మందుల కొరత వేధిస్తోంది.పశువులకు గాయాలైన.. జ్వరం వచ్చిన కనీసం మందులు, టీకాలు లేకుండా పశువైద్యశాలలు కొనసాగుతున్నాయని పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. మద్నూర్, మేనూర్, డోంగ్లీలో పశువైద్యశాలలు ఉన్నాయి. ప్రభుత్వం, ఉన్నతాధికారులు పశువైద్యశాలలను పట్టించుకోకపోవడంతో గ్రామాల్లో మూగజీవాలకు వైద్యం అందడం లేదని పశుపోషకులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రతి సంవత్సరం పశువులు వ్యాధుల బారిన పడి మృతిచెందుతున్నాయి. దీంతో పాటు పశువైద్యశాలల్లో పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేరు.ఈ ఆస్పత్రులకు ఉన్నతాధికారులు మందులు సక్రమంగా సరఫరా చేయకపోవడం సమస్యగా మారింది.
లంపి స్కిన్ వ్యాధితో రైతుల ఆందోళన
ప్రస్తుతం దూడలకు లంపి స్కిన్ వ్యాధి సోకడంతో పశుపోషకులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. వైద్య కోసం పశువైద్యశాలకు వెళ్తే అక్కడ మందులు లేవని సిబ్బంది చెబుతున్నారని పశుషోకులు వాపోతున్నారు. దీంతో సరిహద్దున ఉన్న దెగ్లూర్కు దూడలను తరలించి వైద్యం చేయిస్తున్నారు. గొర్రెలు, మేకలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నట్టల నివారణ మందు వేసేవారని గత రెండు సంవత్సరాలుగా వేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్య అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పశువులకు మందులు అందుబాటులో ఉంచాలని, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు అందించాలని పశుపోషకులు కోరుతున్నారు. ఈ విషయమై మద్నూర్ వెటర్నరీ అసిస్టెంట్ సునీతను వివరణ కోరగా మద్నూర్ పశువైద్యశాలలో మందులు లేక కొంత ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నతాధికారుల నుంచి పశువులకు మందులు సరఫరా కావడం లేదు. ఈ విషయమై ఉన్నతాధికారులకు తెలియజేశాం. లంపి స్కిన్ వ్యాధితో పశువులను పశుపోషకులు తీసుకువస్తున్నారు. గొర్రెలకు, మేకలకు వేసే నట్టల నివారణ మందులు ఇంకా రాలేదు.
మద్నూర్లోని పశువైద్యశాల
మద్నూర్ పశువైద్యశాలలో పశువులకు మందులు అందుబాటులో ఉండటం లేదు. రెండు దూడలకు లంపి స్కిన్ వ్యాధి సోకడంతో మద్నూర్ పశువైద్యశాలకు తీసుకెళ్లాం. అక్కడి సిబ్బంది మందులు లేవని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక దేగ్లూర్ నుంచి మందులు తీసుకొచ్చి వేశాం. – శ్యామ్, పశుపోషకుడు, మద్నూర్
సరఫరా చేయని అధికారులు
గొర్రెలు, మేకలు, దూడలకు
అందని టీకాలు
బయటి మార్కెట్లో కొనుగోలు
చేయాల్సిన పరిస్థితి
మద్నూర్ ఉమ్మడి మండలంలో
ఇబ్బందులు పడుతున్న పశుపోషకులు

పశువైద్యశాలలో మందుల కొరత

పశువైద్యశాలలో మందుల కొరత