సాక్షి ప్రతినిధి, కాకినాడ: గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు నూతన కమిటీలను నియమిస్తామని జనసేన పార్టీ అధినాయకత్వం ఎట్టకేలకు ప్రకటించింది. దీనికోసం ఆ పార్టీ శ్రేణుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. అన్ని అంశాలూ పరిశీలించాక కమిటీలను ప్రకటిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో జిల్లా, నియోజకవర్గ ఇన్చార్జులు, మండల అధ్యక్ష పదవుల భర్తీకి జనసేన అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో జిల్లా అధ్యక్ష పదవుల భర్తీ కీలకంగా మారింది. పార్టీ శ్రేణులపై అధినేత పవన్ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని.. జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూటమిలో తమకు తగిన ప్రాధాన్యం దక్కదనే ఉద్దేశంతో ఈ పదవికి ఎక్కువ మంది నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవులకు దరఖాస్తులు నామమాత్రంగానే అందినట్లు సమాచారం. వాస్తవానికి కూటమి కట్టినప్పటి నుంచీ.. ఆ మాటకొస్తే ఆవిర్భావం నుంచీ జనసేన పార్టీ.. టీడీపీ ప్రయోజనాల కోసమే పని చేసిందనే విమర్శ ఉంది. క్షేత్ర స్థాయిలో టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. అయినప్పటికీ సర్దుకుపోవాలంటూ తమ శ్రేణులకు హితబోధ చేయడం మినహా అధినేత పవన్ కల్యాణ్ తీసుకుంటున్న చర్యలేవీ లేవు. ఆయన వ్యవహార శైలిపై ఆ పార్టీ శ్రేణులు విసిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ జిల్లా అధ్యక్ష పదవులకు పెద్దగా దరఖాస్తులు ఇవ్వలేదని అంటున్నారు.
భగ్గుమంటున్న విభేదాలు
సరిగ్గా ఇదే తరుణంలో ‘టీ గ్లాసు’లో గలాటా మొదలైంది. జనసేన జిల్లా అధ్యక్ష పదవుల భర్తీలో కోసం ఎవరికి వారే వర్గాలుగా విడిపోయి కుమ్ములాడుకుంటున్నారు. జిల్లా పీఠం తమ నేతకే దక్కాలనే పట్టుదలతో ఎవరి స్థాయిలో వారు పావులు కదుపుతున్నారు. పార్టీ కోసం శ్రమించిన తమకే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తే సహించేది లేదంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు.
ఫ జనసేన కాకినాడ జిల్లా అధ్యక్ష పదవి భర్తీపై ఆ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ పదవికి కొన్నాళ్ల కిందట జనసేన తీర్థం పుచ్చుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పోటీ పడుతున్నారు. ఈ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరంగా చేస్తున్నారు. ఇటీవల డీసీసీబీలో జరిగిన నిధుల గోల్మాల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగుల నిధుల స్వాహా అంశం అధినేత పవన్ దృష్టికి వెళ్లిందని, ఆయన డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబుకు చీవాట్లు పెట్టారని చెబుతున్నారు. దీని వెనుక దొరబాబు వర్గం కీలక పాత్ర పోషించిందని తుమ్మల బాబు వర్గం అనుమానిస్తున్నట్లు సమాచారం. దీంతో, ఈ రెండు వర్గాల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. పెండెం దొరబాబుకు అధ్యక్ష పీఠం దక్కకుండా చేసేందుకు బాబు వర్గం పావులు కదుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా తుమ్మల బాబుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం తమకు లేదని, జిల్లా అధ్యక్ష పీఠం తమకే దక్కుతుందని దొరబాబు వర్గం ధీమాగా ఉంది. దీని కోసం పవన్ వద్ద పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది.
ఫ జిల్లా అధ్యక్ష పదవికి సంబంధించి కోనసీమలో సైతం విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ జనసేన కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు, అమలాపురానికి చెందిన నల్లా శ్రీధర్, ఎస్సీ కోటాలో అయితే గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ పదవి తమకు దక్కుతుందంటే తమకేనంటూ వారు తమ అనుచరులకు లీక్లు ఇస్తున్నారు. పార్టీ బలోపేతానికి శ్రమించిన తమకు అధ్యక్ష పదవి కట్టబెట్టకపోతే సహించేది లేదంటూ ఆయా వర్గాలు అల్టిమేటం జారీ చేస్తున్నాయి.
ఫ జనసేనలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష స్థానానికి ఆదరణ కరువైంది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాత్రమే ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.
ఇతర పదవుల్లోనూ అన్యాయం
కూటమి ప్రభుత్వం ఏర్పడిన చాలా కాలం తర్వాత దశల వారీగా నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. అందులో సైతం జనసేనకు మొండిచేయి చూపారు. జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కొన్ని పదవులు ఇచ్చారు. సింహభాగం టీడీపీ నేతలకే కట్టబెట్టేయడంతో కూటమిలోని జనసేన, బీజేపీ నేతలకు ఆశాభంగమే ఎదురైంది. ఈ తరుణంలో కనీసం పార్టీ పదవుల్లోనైనా తమకు న్యాయం చేయాలని అధినేత పవన్ను జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
ఫ జిల్లా అధ్యక్ష పదవుల
కోసం జనసేనలో సిగపట్లు
ఫ ఉమ్మడి జిల్లాలో వర్గాలుగా
విడిపోయి కుమ్ములాటలు
ఫ నేతల మధ్య ముదురుతున్న వర్గపోరు
ఫ తమ నేతకే దక్కాలంటూ లాబీయింగ్


