చాగల్లు: మండలంలోని బ్రాహ్మణగూడెంలో ఓ ఇంట్లో దొంగలు చొరబడి బంగారం, వెండి వస్తువులు, నగదు అపహరించుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాధవరెడ్డి రత్నకుమారి గత మంగళవారం విజయవాడలోని బంధువుల ఇంటికి పరామర్శ నిమిత్తం వెళ్లారు. తిరిగి ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చారు. తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా, బీరువా పగులగొట్టి వస్తువులు మంచం మీద చెల్లాచెదురుగా పడేసి ఉన్నాయి. పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ వస్తువులు, వంటగదిలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించారు. డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న సుమారు 2 కాసుల బంగారు వస్తువులు, వెండి వస్తువులు, రూ.40 వేల నగదు, విలువైన రెండు వాచీలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు గుర్తించారు. తన కుమారుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారని, ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నానని, ఊరు వెళుతున్న సమయంలో ఇంట్లో లైట్లు వేసి వెళ్లానని ఆమె చెప్పారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
క్వాంటం టెక్నాలజీస్దే భవిష్యత్ ప్రపంచం
రాజానగరం: సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో క్వాంటం టెక్నాలజీస్ భవిష్యత్ ప్రపంచాన్ని మరింత ప్రభావితం చేయగలదని పలువురు నిపుణులు అన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి యువత ఈ రంగంపై అవగాహనను పెంచుకుని, అవసరమైన నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. రాజానగరం సమీపాన గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో ‘క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ కంప్యూటింగ్–ఇండస్ట్రీ పెర్స్పెక్టివ్స్ అండ్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఈ విషయాలను పలువురు నిపుణులు ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రొ.చాన్సలర్ కె. శశికిరణ్వర్మ మాట్లాడుతూ నేడు ప్రపంచంలో సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగునంగా విద్యార్థులు కూడా తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాలన్నారు. విద్యార్థులు సంప్రదాయ కంప్యూటింగ్ పరిజ్ఞానంతో పాటు క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం అల్గారిథమ్స్, క్వాంటం సెక్యూర్టీ, క్వాంటం సాఫ్ట్వేర్ విభాగాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.


