మేము సాగునీటి కోసం అందరినీ అడిగాం. ఎవరూ పట్టించుకోలేదు. నీరు రాక నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి ఎదురైంది. కనీసం మోటార్లతో తోడి నారుమళ్లకు నీరు పెడదామన్నా, కాలువలు ఎండిపోయాయి. మా బాధలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీతకు చెప్పుకొన్నాం. ఆమె వెంటనే స్పందించారు. మా బాధలు విని మాతో కలసి ఆందోళన చేశారు. అధికారులకు సమస్యను వివరించారు. సమస్య తీర్చకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన అధికారులు సాగునీరు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇదంతా గీత చేసిన పోరాట ఫలితమే.
–తటవర్తి సీతారామయ్య, రైతు, మల్లవరం, గొల్లప్రోలు మండలం
పంట చేతికందే వరకూ పోరాటం
ఖరీఫ్కు పూర్తిగా సాగునీరందే వరకూ రైతుల పక్షాన పోరాటం చేస్తాం. అధికారులు ప్రకటించినట్లు రోజూ వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలి. పంట చేతికందే వరకు సాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి. రైతుల తరఫున తాము చేసిన పోరాటంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. అయితే ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి. కొందరు ఇప్పటికే పూర్తి స్థాయిలో నీరు వస్తోందని, తామే రాజకీయం చేస్తున్నామంటూ ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా పూర్తి స్థాయిలో నీరు వస్తే నారుమళ్లు ఎందుకు ఎండిపోయాయి. కాలువలు ఎందుకు అడుగంటాయనేది ఆ నేతలే చెప్పాలి.
–గీత వంగా, వైఎస్సార్ సీపీ
నియోజకవర్గ ఇన్చార్జ్, పిఠాపురం
●


