రూ.90 లక్షల ఆస్తి నష్టం
ముమ్మిడివరం: మండలంలోని కొత్తలంకలో బుధవారం షార్ట్సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో కొబ్బరి గోదాం దగ్ధమై రూ.90 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఆ గ్రామానికి చెందిన గుత్తుల మల్లికార్జునరావుకు చెందిన కొబ్బరి గోదాంలో అదే గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి సత్యనారాయణ 2.50 లక్షల కురిడీ కొబ్బరికాయలను నిల్వ చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి కొబ్బరికాయలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.80 లక్షల విలువైన కొబ్బరికాయలు కాలి బూడిద కాగా రూ.10 లక్షల విలువైన గోదాం ధ్వంసమైంది. ముమ్మిడివరం అగ్నిమాపక అధికారి ఎస్.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. స్థానిక తహసీల్దార్ టి.సుభాష్, వీఆర్ఓ రెడ్డి సుబ్రహ్మణ్యం క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి నష్టాలను నమోదు చేశారు.
గుర్తుతెలియని
వ్యక్తి మృతదేహం
పిఠాపురం రూరల్: స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా సమీపాన గొరిఖండి కాలువలో బుధవారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. అతడు జీన్స్ ఫ్యాంటు, ఫుల్ హ్యాండ్ షర్ట్ ధరించి, ఫ్యాంటుకు బెల్టు ధరించి ఉన్నట్లు గుర్తించారు. మృతుడి కుడి చేతిపై ‘ఎస్ఆర్’ అని ఇంగ్లీషులో టాటూ, అలాగే ఎడమ చేతిపై ‘అమ్మ నాన్న‘ అని తెలుగులో, ‘శిరీషా‘ అని ఇంగ్లీషులో టాటూ గుర్తులు ఉన్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతని ఆచూకీ గుర్తించగలిగిన వారు పిఠాపురం సీఐ–9440796523 లేదా పిఠాపురం రూరల్ పోలీస్ ఎస్సై 9490760765 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.


