కొత్తపేట: మండలంలోని వానపల్లి గ్రామ దేవత పళ్లాలమ్మ అమ్మవారు ఆదివారం గాజుల అలంకరణతో దర్శనమిచ్చారు. ఆషాఢమాసం ఆదివారాల్లో అమ్మవారికి వివిధ అలంకరణల్లో భాగంగా రెండో ఆదివారం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మద్దింశెట్టి ఆదినారాయణ ఆధ్వర్యంలో గాజులతో అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో భక్తులు ముఖ్యంగా మహిళలు సుమారు 20 వేలు గాజులు సమర్పించగా వాటిని దండలుగా కట్టి, ఆలయ ఆసాదులు అమ్మవారికి అలంకరించారు. అలాగే అమ్మవారికి ఆషాఢమాసం సారె ఆనవాయితీని అనుసరించి గ్రామస్తులు సారె కావళ్లు సమర్పించారు. అందరూ వానపల్లి కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి మేళతాళాలతో పళ్లాలమ్మ వారి ఆలయానికి చేరుకున్నారు. వివిధ రకాల స్వీట్స్ సుమారు 200 కేజీలు సారెను ఆసాదులు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. వానపల్లి పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొనగా వారికి తీర్థ, ప్రసాదాలు పంపిణీ చేశారు.
గాజుల అలంకరణలో
వానపల్లి గ్రామ దేవత పళ్లాలమ్మ


