అన్నవరం: రత్నగిరిపై ప్రథమశ్రేణి వ్రత పురోహితుడిపై క్రమశిక్షణ చర్యలను దేవస్థానం ట్రస్ట్ బోర్డు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై విచారణకు హాజరు కావాలని దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, పురోహితుడు గురుమూర్తిని దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ అజాద్ ఆదేశించారు. గత ఏడాది డిసెంబర్ 21న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సత్యదేవుని సామూహిక వ్రతాల నిర్వహణకు వెళ్లిన ఆరుగురు పురోహితుల బృందంలో మల్లాది గురుమూర్తి ఒకరు. ఆయన అక్కడ వ్రతకథ చెబుతూ భక్తులను గోదానం, భూదానం ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు అందింది. దీనిపై కమిషనర్ ఆదేశాల మేరకు అప్పటి ఈఓ వేండ్ర త్రినాథరావు విచారణ జరిపి గురుమూర్తికి రెండు ఇంక్రిమెంట్లు కట్ చేయడంతో పాటు భవిష్యత్లో వ్రతకథ చెప్పవద్దని మార్చి 21న ఆదేశించారు. కాగా, గత నెల 24న జరిగిన దేవస్థానం ట్రస్ట్బోర్డు సమావేశంలో గురుమూర్తిపై ఆ చర్యలను పాక్షికంగా రద్దు చేస్తూ తీర్మానం చేశారు. దీనిపై ఈ నెల 3న ‘సాక్షి’ దినపత్రికలో ‘ఒట్టి అమాయకుడు గురూ..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ విషయమై 29న విచారణకు హాజరు కావాలని ఈఓ, పురోహితులను అడిషనల్ కమిషనర్ ఆదేశించారు.


