ఆత్రేయపురం: ర్యాలిలోని జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో దివ్య కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఐదో రోజు మంగళవారం వేద పండితులు ఆగమ శాస్త్రానుసారం సదస్యం నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన, నిత్య ఉపాసన, వేద పారాయణ, సాయంత్రం సదస్యం జరిపారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. రాత్రి రాజమహేంద్రవరం సత్య శ్రావణి బృందం ప్రదర్శించిన భరతనాట్యం అలరించింది. ఆలయ చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, ఆలయ ఈవో భాగవతుల వెంకట రమణ మూర్తి తదితరులు వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు, బృందం సభ్యులు సదస్యంలో పాల్గొన్నారు.
పేకాట శిబిరంపై దాడి
అనపర్తి: మండలంలోని మహేంద్రవాడ గ్రామ శివారులో పేకాడుతున్న వారిని పట్టుకున్నామని ఎస్సై ఎల్.శ్రీను నాయక్ తెలిపారు. మార్చి 29న సాయంత్రం 6 గంటలకు తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి దాడి నిర్వహించామన్నారు. ఈ దాడిలో పొలమూరు గ్రామానికి చెందిన అల్లక ఉమామహేశ్వరరావు, గుత్తుల హరి దుర్గ, ద్వారంపూడి ప్రభాకర రెడ్డి, ద్వారంపూడి ఈశ్వరరెడ్డి, దాసరి వీర వెంకట సత్యనారాయణ చౌదరి, కొవ్వూరి కాశీవిశ్వనాథరెడ్డి, బిక్కిన శ్రీనుబాబు, అమరపు దుర్గప్రసాద్ పేకాట ఆడుతూ పట్టుబడ్డారన్నారు. వారి నుంచి రూ.18,130, రెండు సెట్ల కార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.


